హైదరాబాద్: పోక్సో కేసులో నిందితుడైన బండి భగీరథ్ శనివారం రాత్రి హైదరాబాద్ లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడైన బండి భగీరథ్ అంశం గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. తన కుమారున్ని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ పోలీసులకు అప్పగించాలని తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి నిన్న సూచించిన విషయం కూడా విదితమే.
బండి సంజయ్ బాధ్యత తీసుకుని, తన కొడుకును విచారణకు పంపాలని, సంజయ్ నైతిక బాధ్యత తీసుకోవాలని సూచిస్తున్నానని, విచారణను ధైర్యంగా ఎదుర్కోవాలని, పారిపోతే పరిష్కారం లభించదని, తప్పయినా, ఒప్పయినా బాధ్యతగా వ్యవహరించాలని సంజయ్ కి సూచిస్తున్నానని, తక్షణమే తన కుమారున్ని తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో అప్పగించాలని సీఎం రేవంత్ సంజయ్ కు హితవు పలికారు. నేపథ్యంలోనే బండి భగీరథ్ లొంగుబాటు పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
కాగా బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో శనివారం కీలక పరిణామం కూడా చోటు చేసుకుంది. బాధితురాలిని మేడ్చల్ మేజిస్ట్రేట్ ఎదుట పోలీసులు హాజరుపర్చగా, ఆమె వాంగ్మూలాన్ని, బాధితురాలి తల్లి స్టేట్మెంట్ ను దాదాపు 40 నిమిషాల పాటు నమోదు చేశారు. ఈ అంశంలో పోలీసులు ఇప్పటికే రెండుసార్లు బాధితురాలి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అంతకు ముందు ఉదయం జరిగిన పరిణామాల్లో బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఐదు టీంలుగా పోలీసులు అతనికోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్ లోని బండి సంజయ్ నివాసంలోనూ పోలీసులు భగీరథ్ కోసం తనిఖీ చేశారు.

‘సత్యమేవ జయతే’: బండి సంజయ్ కీలక ప్రకటన
కాగా బండి భగీరథ్ లొంగుబాటు నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక ప్రకటన విడుదల చేశారు. ‘సత్యమేవ జయతే.. అంటూ సంజయ్ విడుదల చేసిన ఆయా ప్రకటన ఉన్నది ఉన్నట్లుగా ..
‘మా అబ్బాయి బండి భగీరథ్ పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో చట్టంపైనున్న గౌరవంతో ఈరోజు అడ్వొకేట్ల ద్వారా పోలీసుల విచారణ కోసం అప్పగించాను. నేను ఇంతకు ముందే చెప్పిన. చట్టం ముందు నా బిడ్డైనా, సామాన్యుడైనా సమానమే. అందరం చట్టానికి లోబడి ఉండాల్సిందే.మా అబ్బాయి ఏ తప్పు చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే ఆయనను స్టేషన్ లో అప్పగిద్దామనుకున్నా.. లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్ తప్పకుండా వస్తుందని లాయర్లు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఈరోజు కూడా బెయిల్ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. అయితే ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి పోలీసులకు లాయర్ల ద్వారా విచారణ కోసం అప్పగించాను. న్యాయ వ్యవస్థపై సంపూర్ణమైన నమ్మకముంది. సోమవారం నాడు కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థపై ఉన్న గౌరవంతో ఇంకా ఆలస్యం కావద్దనే ఉద్దేశంతో మా అబ్బాయిని విచారణకు పంపించాను.’ అని -కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

భగీరథ్ ను అరెస్ట్ చేశాం: సైబరాబాద్ సీపీ రమేష్ రెడ్డి
అయితే పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ ను తామే అరెస్ట్ చేసినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్ రెడ్డి ప్రకటించారు. నార్సింగ్ పోలీసు అకాడమీ వద్ద అరెస్ట్ చేసి, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
Update:
కాగా బండి భగీరథ్ కు మేడ్చల్ మేజిస్ట్రేట్ 14 రోజులపాటు రిమాండ్ విధించారు. భగీరథ్ కు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు అతన్ని గత అర్థరాత్రి సమయంలో మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా, రిమాండ్ విధించారు. దీంతో భగీరథ్ ను పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు.

