(సమీక్ష ప్రత్యేక కథనం)
పాలకపక్షంలో ఉన్నవాళ్లకు కొన్ని సీన్లు గుర్తుండకపోవచ్చు.. మర్చిపోవడం సహజం.. ఎందుకంటే ‘పవర్’ను ఎంజాయ్ చేస్తున్న పరిస్థితుల్లో ప్రత్యర్థిని ఎలా నిలువరించాలనే తపన తప్ప, ఫలితంగా జరిగే రాజకీయ నష్టాన్ని అంచనావేసే స్థితిలో బహుషా పాలకులు ఉండకపోవచ్చు.. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే..?
జగిత్యాలలో హైవే రోడ్డును అధికారులు అడ్డంగా తవ్వేశారట. జగిత్యాల-కోరుట్ల మార్గంలో గల ఆ రోడ్డును అధికారులు ఇప్పుడే తవ్వడంపై రాజకీయ రగడ జరుగుతోంది. ఇంతకీ రోడ్డును ఇప్పుడు ఎందుకు తవ్వారనే ప్రశ్నకు వస్తే.. ఈనెల 20వ తేదీన మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. గులాబీ పార్టీ చీఫ్ కేసీఆర్ సమక్షంలో ఆయన బీఆర్ఎస్ కండువా కప్పుకోబోతున్నారు. ఈ సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు జనం రాకుండా నిలువరించి, ఇబ్బందులపాలు చేయడానికే అధికార పార్టీ నాయకులు రోడ్లు తవ్వే దుశ్చర్యకు పాల్పడుతున్నారనేది బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ..

ఈ ఆరోపణల సంగతెలా ఉన్నప్పటికీ, దాదాపు మూడేళ్ల క్రితం.. 2023 జూన్ 2వ తేదీన జరిగిన ఓ సంఘటనను అధికార పార్టీ నాయకులు ఓసారి మననం చేసుకోవలసిన అవసరముంది. బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేసి వివిధ రాజకీయ సమీకరణలు, బలాబలాలను బేరీజు వేసుకున్న తర్వాత అప్పటి మాజీ ఎంపీ, ప్రస్తుత రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే 2023 జూన్ రెండో తేదీన ఖమ్మంలోని తన భూముల్లోనే ‘జనగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. పొంగులేటిని పార్టీలో చేర్చుకోవడానికి ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ స్వయంగా ఖమ్మం వచ్చారు. రాహుల్ గాంధీ సమక్షంలోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డితోపాటు, ఆయన అనుచరగణం కాంగ్రెస్ పార్టీలో చేరారు.
అయితే పొంగులేటి ఆరోజు నిర్వహించిన ‘జనగర్జన’ సభకు అప్పటి అధికార పార్టీ, ఇప్పటి విపక్ష బీఆర్ఎస్ నాయకులు సృష్టించిన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు. ఆర్టీసీ బస్సులు ఇచ్చేందుకు నిరాకరించారు. ప్రయివేట్ బస్సులూ దొరకకుండా పావులు కదిపారు. స్కూళ్ల యాజమాన్యాలకు బెదిరింపు తరహా తాఖీదులు వెళ్లాయి. సభ జరిగిన రోజు పొంగులేటి సహా ఆయన అనుయాయ నాయకులు పడిన టెన్షన్ అంతా ఇంతా కాదు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలలనూ ఆర్టీఏ, పోలీసు అధికారులు దిగ్బంధించారు. ప్రయివేట్ వాహనాల తనిఖీ, పర్మిట్లు, పొల్యూషన్ సర్టిఫికెట్లు అంటూ నానా ఇబ్బందుకు గురి చేశారు. సాయంత్రం మూడున్నర గంటలు అవుతున్నప్పటికీ ‘జనగర్జన’ సభకు ప్రజలు చేరుకోలేకపోయారు.

సమయం దాదాపు నాలుగున్నర గంటలు కావస్తోంది.. సభా ప్రాంగణం పేలవంగా ఉంది. రాహుల్ గాంధీ వచ్చే సమయం ఆసన్నమైంది. సభలో జనం లేరు. పొంగులేటి వర్గీయులు టెన్షన్ పడుుతున్నారు.. కానీ ఉన్నట్టుండి జనం చీమలదండులా ‘జనగర్జన’ సభకు తరలివస్తున్న తీరును చూసి ఆశ్చర్యపోవడం మీడియా వంతు మాత్రమే కాదు, పోలీసు, రవాణా శాఖ అధికారులు సైతం నివ్వెరపోయారు. ‘జనగర్జన’ సభకు జనం రాకుండా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వివిధ ప్రభుత్వ యంత్రాంగాల ద్వారా నిలువరించిన అప్పటి బీఆర్ఎస్ పాలకులకు బిగ్ ‘షాక్’నిస్తూ లక్షలాది మంది ప్రజలు తండోపతండాలుగా తరలిరావడం వెనుక జరిగిన అసలు ‘సీన్’ల సమాచారం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆ రోజు ఏం జరిగిందో తెలుసా..?
పొంగులేటి సభకు వెళ్లకుండా కోదాడలో తమను నిలువరించిన ఓ రవాణా శాఖ అధికారి ప్రవర్తనను గంటలకొద్దీ సహనంతో వేచి చూసిన ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. అతనిపై దాడి చేసినట్లు వార్తలు వచ్చాయి. ఖమ్మం జిల్లా ఏన్కూరులోనూ తాము ప్రయాణిస్తున్న ప్రయివేట్ వాహనాలను నిలిపి, ఆ సర్టిపికెట్, ఈ కాగితం అంటూ కాలయాపన చేస్తున్న రవాణా శాఖకు చెందిన మరో అధికారిపైనా ప్రజలు తిరగబడినట్లు వార్తలు వచ్చాయి. ఈ తరహా ప్రజాగ్రహ సీన్లు అనేకం చోటు చేసుకున్నట్లు నిఘా వర్గాలు నివేదించడంతో ఖమ్మం జిల్లా పోలీసు యంత్రాంగం కూడా చేతులెత్తేసింది. అప్పటి వరకు ఈ సభను ఎలాగైనా ఫెయిల్ చేయాలని కంకణం కట్టుకున్నట్లు విమర్శలు ఎదుర్కుని, వేదికవద్దే హల్ చల్ చేసిన అప్పటి ఓ పోలీసు ఉన్నతాధికారి అకస్మాత్తుగా అక్కడి నుంచి పక్కకు తప్పుకోవడం ఆసక్తికర పరిణామంగా సభికులు చర్చించుకున్నారు.
విషయం అర్థమైంది కదా..? ఓ ప్రజా నాయకుడి సభను ఫెయిల్ చేయాలని, అతనికి ప్రజాబలమే లేదని నిరూపించే పాలకపార్టీ యత్నానికి ప్రజలే తగిన గుణపాఠం నేర్పిన చరిత్రాత్మ సభ అది. తమను సభకు వెళ్లకుండా నిలువరిస్తున్న అధికారులపై ఆగ్రహించిన ప్రజల కోపాగ్నిని తట్టుకోలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా దారులన్నీ ఫ్రీగా వదిలేయక అధికారులకు తప్పలేదు. ఫలితంగానే కేవలం గంట వ్యవధిలో వందెకరాల పొంగులేటి భూముల్లో నిర్వహించిన ‘జనగర్జన’ సభ లక్షలాది మందితో కిక్కిరిసిపోయింది. సభా ప్రాంగణం వెలుపల గల వైరా రోడ్ సైతం జామ్ అయ్యింది. సభకు వచ్చిన జనాన్ని చూసి రాహుల్ గాంధీ సైతం సంబ్రమాశ్చర్యానికి గురయ్యారంటే అతిశయోక్తి కాదు.

అప్పటి ఈ సీన్ ను ఇప్పుడు ఇంతగా గుర్తు చేయడానికి జగిత్యాలలో తవ్విన హైవే రోడ్డు సీన్ ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ‘సమీక్ష’ సేకరింంచిన సమాచారం ప్రకారం.. ఎప్పుడో రెండున్నరేళ్ల క్రితం జగిత్యాల-కోరుట్ల మార్గంలో మంజూరైన కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణానికి ఇప్పుడే.. అంటే జీవన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు జగిత్యాలకు వస్తున్న కేసీఆర్ సభ నిర్వహణ రోజే అధికారులకు వీలు చిక్కిందా? అనేది ప్రజల్లో మెదలుతున్న ప్రశ్న. ఈ వంతెన నిర్మాణానికి రెండున్నరేళ్ల క్రితమే టెండర్ల నిర్వహణ, అగ్రిమెంట్ కూడా పూర్తయిందట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కల్వర్టుపై బ్రిడ్జి నిర్మాణానికి అధికారులకు వీలు పడకపోవడమే ఆశ్చర్యకరంగా జనం చర్చించుకుంటున్నారు.
బ్రిడ్జి నిర్మాణానికి ఇన్నేళ్లుగా లేని తొందర జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక రోజే అధికారులకు రావడంపై సహజమైన విమర్శలే వస్తాయి. జగిత్యాల-కోరుట్ల మార్గంలో తవ్వేసిన ప్రధాన మార్గంలో కనీసం మనిషి కూడా నడిచే వీలు లేకుండా చేశారట. మరి నిజామాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఎలా ప్రయాణిస్తున్నాయంటే.. ధరూర్ మార్గంలోకి మళ్లించారట. ఓ హైవేపై ఇటువంటి వంతెనల నిర్మాణం కోసం పనులు ప్రారంభించే ముందే ప్రత్యామ్నాయ మార్గంగా పక్కనుంచి అప్రోచ్ రోడ్డు నిర్మిస్తారు. కానీ ఇక్కడ అటువంటి రోడ్డు ఏదీ నిర్మించకుండానే ప్రధాన రహదారికి గండి కొట్టేశారనేది బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ. కేవలం కేసీఆర్ సభకు జనం రాకుండా నిలువరించడానికే అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి పాలక పార్టీ నేతలు, ముఖ్యంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఒత్తిడి తీసుకువచ్చారని గులాబీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇది చాలదన్నట్లు కేసీఆర్ సభకు ఆర్టీసీ బస్సులు కూడా ఇవ్వడానికి నిరాకరించినట్లు ధ్రువపడని సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అంతేకాదు ఇదే రోజు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు టూర్ లో భాగంగా మేడిగడ్డకు బయలుదేరుతుండడం గమనార్హం. కేసీఆర్ సభ, జీవన్ రెడ్డి చేరిక వంటి అంశాల ప్రాధాన్యతను తగ్గించేందుకే సీఎం రేవంత్ అదేరోజు పర్యటనకు నిర్ణయం తీసుకున్నారని గులాబీ పార్టీ అధికార పత్రిక ఓ వార్తా కథనాన్ని తన పాఠకులకు అందించింది.
మొత్తంగా పరిశీలించినపుడు సీఎం మేడిగడ్డ టూర్ సంగతెలా ఉన్నప్పటికీ, జగిత్యాలలో రోడ్ల తవ్వకం మాత్రం అధికార పార్టీపై ప్రజల్లో భిన్నాభిప్రాయానికి తావు కల్పిస్తుందని చెప్పక తప్పదు. జీవన్ రెడ్డి పొంగులేటి స్థాయి ‘ఆర్థిక’ బలం గల నాయకుడు కాకపోవచ్చు. కానీ దశాబ్ధాల రాజకీయ ప్రస్థానంలో ప్రజాబలం గల నాయకుడు. జగిత్యాలలోనే కాదు, ఇరుగు పొరుగున గల ధర్మపురి, కోరుట్ల, వేములవాడ, చొప్పదండి తదితర నియోజకవర్గాల్లోనూ జీవన్ రెడ్డి తాజా రాజకీయ పయనం ప్రభావితం చేస్తుందనేది గ్రహించాల్సిన అసలు విషయం. ఓ సభను నిలువరించడమో, దానికి ఆటంకం కలిగించే చర్యలకు పాల్పడితే ప్రజల్లో ఏర్పడే భావన ఏమిటో గుర్తు చేయడానికి మూడేళ్ల క్రితంనాటి పొంగులేటి ‘జనగర్జన’ సభ ఓ నిదర్శనం మాత్రమే.

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నపుడు, 2009 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మెగాస్టార్ చిరంజీవి జనంలో పర్యటిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపన సందర్భంగా చిరంజీవి పర్యటనను అప్పటి ప్రభుత్వం ఎక్కడా నిలువరించలేదు. వదిలేస్తేనే కదా..? అతని బలమేంటో మనకు తెలిసేది..? అని డాక్టర్ రాజశేఖర్ రెడ్డి అన్నట్లు నాకు బాగా గుర్తు. ఎందుకంటే నేను అప్పుడు ‘సాక్షి’ పత్రికలో ఖమ్మం బ్యూరో ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాను. అందువల్ల చెప్పొచ్చేదేమిటంటే.. జగిత్యాలలో రోడ్ల తవ్వకం ద్వారా కేసీఆర్ సభకు జనం రాకుండా నిలువరిస్తారా? లేదా? అనేది అసలు ప్రశ్నే కాకపోవచ్చు. కానీ ఫ్రీగా వదిలేస్తేనే కదా.. జీవన్ రెడ్డి బలమేంటో తెలిసేది..? ఈ చిన్న లాజిక్ ను మర్చిపోతే జీవన్ రెడ్డి బలమేంటో తెలియకపోతే అది అంతిమంగా ఎవరికి నష్టమనేది పాలక పార్టీ నాయకులకు గ్రహించకపోయినా, ప్రజలకు తెలియని విషయం మాత్రం కాకపోవచ్చు..!

✍️ ఎడమ సమ్మిరెడ్డి

