ఖమ్మం: సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావుకు జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) నోటీసు జారీ చేసింది. పోటు రంగారావుపై దేశద్రోహం, ఉపా కేసు ఉందని, ఈనెల 22వ తేదీన ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసులో NIA పేర్కొంది.
CRPCలోని 160 సెక్షన్ కింద నోటీస్ జారీ చేశారు. గత నవంబర్ 26వ తేదీన హైదరాబాద్ ఎన్ఐఏ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం.. బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 152, UA(P) యాక్ట్ లోని సెక్షన్ 13, 39 కింద కేసు నమోదైనట్లు నోటీసులో పేర్కొన్నారు.
దశాబ్దాలుగా ఖమ్మంలోనే నివాసముంటున్న పోటు రంగారావుకు ఆయన ఆధార్ కార్డు చిరునామా ఆధారంగా హుజూర్ నగర్ మండలం రంగాపురంలోని నివాసానికి ఈ నోటీసు రావడం గమనార్హం. ఇది ప్రశ్నించేవారిపై ఉక్కుపాదం మోపాలనే యత్నమని పోటు రంగారావు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
కాగా పోటు రంగారావుకు NIA జారీ చేసిన నోటీసు ప్రతిని దిగువన చూడవచ్చు.


