(సమీక్ష ప్రత్యేక కథనం)
కూనంనేని సాంబశివరావు తెలుసు కదా? తన మదిలో ఏముందో బాహాటంగానే వెళ్లగక్కే సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూడా. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి, పొత్తు కుదుర్చుకుని, ఆ పార్టీ అధికారంలోకి రావడానికి దోహదపడిన పార్టీకి చెందిన ఈ కామ్రేడ్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనపై తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు తావు కల్పించాయి.
వాస్తవానికి కూనంనేని చేసిన ఈ వ్యాఖ్యలను మెయిన్ స్ట్రీమ్ మీడియానే కాదు, సీపీఐ పార్టీకి చెందిన అధికార పత్రిక కూడా పెద్దగా పసిగట్టినట్లుగానీ, పట్టించుకున్నట్లుగానీ లేదు. ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై కూనంనేని సాంబశివరావు చేసిన ఆ వ్యాఖ్యలేమిటో ఉన్నది ఉన్నట్లుగానే ఓసారి చదవండి.
‘‘సో.. ఆ విధంగా బస్సులు కూడా శుభ్రంగా ఉండాలి.. ప్రయాణం చేసేవాళ్లకి. ఎట్టాగోట్టా వాళ్లెక్కుతున్నార్లే అన్జెప్పి దాని జోలికెళ్లకుండా ఉండడమనేది ధర్మం గాదు..వాటిని నీట్ గా ఉంచాలి. రాష్ట్రంలో ఉన్న బస్టాండ్లు నూట నలభై మూడే.. అయిదేసి కోట్లేసుకో… ఎంతవుద్ది? ఏడెందొల కోట్లు.. ఏడెందుల కోట్లు (నవ్వుతూ) ఈళ్ల పరిపాలనా..ఈళ్లు.. పాడుగానూ.. నాకు బీపీ లేస్తోంది.. తిట్టలేక ఈ మాటంటున్న.. ఆడోళ్లన్నట్టుగా అనాల్సొస్తుంది. నాకంత కోపమొస్తోంది..ఈ బస్టాండ్లవీ జూత్తంటే. ఎందుకంటే..? నేనైతే సంవత్సరంలో రూపమే మారుస్తా. తెలివుండాలె గదా? తెలివుండాలి.. పట్టుదల ఉండాలి.. దీక్ష ఉండాలి. ఇంత అన్యాయంగా ఉన్నాయ్.. సరే అయినా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఖచ్చితంగా వీటి స్వరూపం మార్చుకునే వరకు కూడా పోరాటం చేద్దాం.. సాధించుకుందాం.’’ అని కూనంనేని పిలుపునిచ్చారు.

ఇవీ కూనంనేని సాంబశివరావు రెండు రోజుల క్రితం కొత్తగూడెం బస్టాండ్ లో ఆర్టీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాలక్ష్మి సంబురాల కార్యక్రమం వేదికగా చేసిన ఘాటు వ్యాఖ్యలు. కాంగ్రెస్ పాలనపైనే కాదు, రవాణా శాఖ పనితీరుపై కూనంనేని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. వాస్తవానికి రేవంత్ రెడ్డి సర్కారు పనితీరును కూనంనేని అనేకసార్లు ప్రశంసించారు కూడా. రేవంత్ రెడ్డిని తాను దగ్గర నుంచి గమనించానని, అత్యంత ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కూడా ఆయన వేర్వేరు సందర్భాల్లో కొనియాడారు. సీపీఐ వందేళ్ల సంబురాల వేదికపైకి రేవంత్ ను ఆహ్వానించి కూడా ఆయనను కామ్రేడ్స్ పొగిడారు కూడా. తనకు దన్నుగా నిలిచిన కామ్రేడ్స్ నేపథ్యంపైనా రేవంత్ రెడ్డి పలుసార్లు కృతజ్ఞతాపూర్వక ప్రసంగం కూడా చేశారు.

అయితే కూనంనేని సాంబశివరావు కొత్తగూడెం బస్టాండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కఠిన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తిట్టలేక తాను ఈ మాటలంటున్నానని, బీపీ లేస్తోందని, చివరికి మహిళల భాషలో అనాల్సి వస్తోందని కూడా కూనంనేని పేర్కొన్నారు. కూనంనేని ప్రభుత్వ పనితీరును నేరుగానే వేలెత్తి చూపినప్పటికీ, ముఖ్యంగా రవాణా శాఖ పనితీరును ఆయన తూర్పారబట్టడం విశేషం. మొత్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికీ మిత్రపక్షంగానే వ్యవహరిస్తున్న సీపీఐ పార్టీకి చెందిన రాష్ట్ర ముఖ్యనేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారాయి.

