హైదరాబాద్: తెలంగాణా అభివృద్ధికి కేంద్రం సహకారం కావాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ప్రధాని మోదీకి పెద్ద మనస్సు ఉందని, ఈ విషయం తెలంగాణాకు తెలుసని, రాష్ట్ర ప్రజలు దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారని సీఎం అన్నారు. ప్రధాన నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హెచ్ఐసీసీలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల కార్యక్రమంలో ప్రధానితోపాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం చేసిన ప్రసంగం లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, గవర్నర్ శుక్లాకి, ప్రియ కేంద్ర మిత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, హాజరైన మిత్రులందరికీ స్వాగతం…
- ఇది అభివృద్ధి ఉత్సవం.. కేంద్ర ప్రభుత్వం కార్యక్రమం కాదు..
- జాతీయ భద్రత, జాతీయ అభివృద్ధే మనకు అత్యధిక ప్రాధాన్యం… ముందు భారత దేశం, తర్వాత ప్రజలు, ఆ తర్వాతే పార్టీ అనేది స్పష్టం..
- ఆ స్ఫూర్తితోనే దేశ నిర్మాణానికి ప్రధానమంత్రి మోదీ వికసిత్ భారత్ 2047ను ప్రకటించినప్పుడు, మేము భాగస్వాములయ్యాం. తెలంగాణ రైజింగ్కు మీరు పూర్తి సహకారం అందిస్తారనే విశ్వాసం మాకు ఉంది.
- తెలంగాణను దేశంలో మొదటి స్థానంలో నిలిపేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.. కాకతీయ మెగా టెక్స్టైల్స్ పార్క్, రైల్వే ప్రాజెక్టులు ప్రారంభించేందుకు మోదీ వచ్చారు…
- అయిదు రాష్ట్రాల ఎన్నికలు ముగిశాయి… మోదీ గారు ఎన్నికలు పూర్తయ్యాక అభివృద్ధి పనులకు వచ్చారు..మనం అభివృద్ధిపై దృష్టి పెట్టాలి..
- మోదీ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి సహకారంతో మీరు గుజరాత్ మోడల్ను అభివృద్ధి చేశారు.. తెలంగాణ ప్రజలు కూడా రాబోయే పదేళ్లలో మీ సహకారంతో మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నారు. నాటి మన్మోహన్ సింగ్ విధంగా, ఆయన స్ఫూర్తితో మీరు నాకు పూర్తి సహకారం అందిస్తారని విశ్వసిస్తున్నా…
- 2034లో 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామనే నమ్మకం ఉంది… 2047 వరకు 3 ట్రిలియన్ డాలర్లు ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటామని ఆశిస్తున్నా.. నాడు మన్మోహన్సింగ్ ఆశీస్సులు అందించినట్లే మీరు తెలంగాణ ప్రజలకు ఆశీస్సులు అందించాలి…
- భారీ ఆర్థిక వృద్ధి, మహా నగరాలు, విశ్వ నగరాల నుంచే వస్తుంది.. మనకు ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్ ఆరు మహా నగరాలున్నాయి. ఈ దేశం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండాలంటే, యువతకు ఉద్యోగాలు రావాలంటే ఈ మహా నగరాలను అభివృద్ధి చేయాలి…
- ఈ ఆరు మెట్రో నగరాలకు సంబంధించిన జాతీయ ప్రాధాన్యత గల అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు త్వరగా లభించేలా ప్రధానమంత్రి కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఉండాలి..
- మోదీ గారూ, నా రాష్ట్రం, నా ప్రజల కోసం సానుకూల నిర్ణయాల విషయంలో నేను మిమ్మల్ని, కేంద్ర మంత్రులను అనేకసార్లు కలిశాను.. మా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులకు మీ అత్యవసర అనుమతులు, ఆమోదాలు అవసరం. మూసీ నది, మెట్రో రైలు, రేడియల్ రోడ్లు, హైదరాబాద్-మచిలీపట్నం వరకు 12 వరుసల రహదారికి సంబంధించి రెండు గంటల పాటు మీరు సమయం కేటాయించి సమీక్షించాలి…
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ మిత్రులు.. మీకు పెద్ద మనస్సు ఉందని చెబుతున్నారు.. మోదీ గారూ మీకు పెద్ద మనస్సు ఉందని తెలంగాణ తెలుసు. నేడు వారు దాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ పనులు, ప్రతిపాదనలు అన్నింటినీ ఈరోజు మీరు ఆమోదిస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు..
- దేశం విషయంలో మేం మీతో కలిసి ఉన్నాం.. మీరు వికసిత్ భారత్ 2047పైన మాట్లాడి, భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే అంశంపై మాట్లాడినప్పుడు, మనం మన రాష్ట్ర కోణంలో ‘తెలంగాణ రైజింగ్ 2047’ను దానికి అనుసంధానం చేశాం..
- ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు.. అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

