మేడ్చల్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ నివాసాల్లో ఏసీబీ తనిఖీలు చేస్తోంది. వంశీ మోహన్ కు చెందిన ఎనిమిది ఇండ్లల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను వంశీ మోహన్ భారీ ఎత్తున స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అతనిపై ఏసీబీ అక్రమాస్తుల కేసును నమోదు చేసి తనిఖీలు నిర్వహిస్తోంది.

శేరిలింగంపల్లిలోనేగాక పలు ఇతర ప్రాంతాల్లో పనిచేసిన డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్ అబ్ధుల్లాపూర్ మెట్, పిగ్లీపురంలో ఎనిమిది ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తన మామ పేరుపై భూమిని రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత ఓ రియల్టర్ కు ధారాదత్తం చేశారనే అభియోగాలను ఎదుర్కుంటున్నారు.

ఈ పరిణామాల్లోనే ఓ రియల్టర్ నుంచి వంశీ మోహన్ పది ప్లాట్లను గిఫ్ట్ డీడ్ రూపంలో తీసుకున్నట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. వందలాది కోట్ల రూపాయల ఆస్తులను వంశీ మోహన్ పోగేసినట్లు ఏసీబీ గుర్తించింది.
Update:
మేడ్చల్-మల్కాజిగిరి డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీ మోహన్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ ఉదయం నుంచి ఆయన అక్రమాస్తుల వ్యవహారాలపై తనిఖీలు నిర్వహించిన అనంతరం వంశీ మోహన్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తనిఖీల అనంతరం వంశీ మోహన్ అక్రమ సంపాదనకు సంబంధించి ఏసీబీ అధికారికంగా విడుదల చేసిన ప్రకటన ప్రతిని దిగువన చూడవచ్చు


