హైదరాబాద్: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తుది శ్వాస విడిచారు. గత రాత్రి 12.50 గంటలకు సుదర్శన్ రెడ్డి చనిపోయినట్లు ఆయనకు చికిత్స అందిస్తున్న సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు.
ఈనెల 26వ తేదీన గుండెపోటుకు గురైన పెద్ది సుదర్శన్ రెడ్డిని చికిత్స కోసం తొలుత హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రికి చేర్చించి, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం యశోదా ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి వెంటిలేటర్ పైనే యశోదా ఆసుపత్రిలో చికిత్స అందించినప్పటికీ, ఫలితం లేకపోయింది.
కేసీఆర్ దిగ్భ్రాంతి:
పెద్ది సుదర్శన్ రెడ్డి 2018లో నర్సంపేట నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర సివిల్ సప్లియస్ ఛైర్మెన్ గానూ పని చేశారు. సుదర్శన్ రెడ్డి మృతిపట్ల బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.. ఆప్తమిత్రుడిని, గొప్ప ఉద్యమ సహచరున్ని కోల్పోయానని, ఆయన మృతి పార్టీకి తీరని లోటని కేసీఆర్ పేర్కొన్నారు
సీఎం రేవంత్ సంతాపం:
కాగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర మరువలేనిదని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతిని, తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు.

