Top 5 This Week

Related Posts

వెరీ ఇంట్రస్టింగ్ ఫొటో.. ఇంతకీ ‘అధ్యక్షత’ వహించిందెవరు?

ఫొటోను నిశితంగా గమనించండి.. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య సమన్వయం కోసం బుధవారం ఢిల్లీలో నిర్వహించిన కీలక సమావేశపు దృశ్యమిది.

చిత్రంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, సీతక్క, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడు వంశీచంద్ రెడ్డి ఉన్నారు.

అయితే  ఈ సమావేశానికి ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హాజరై మాట్లాడతారని ప్రకటించినా, లోక్ సభలో కీలక చర్చలు ఉన్నందున ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు తెలిపినట్లు వార్తలు వచ్చాయి. ఇదే దశలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షత ఈ సమావేశం జరిగినట్లు ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి.

కానీ.. బీఆర్ఎస్ పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణా’ ఈ ఫొటోపై ప్రచురించిన వార్తాకథనపు సారాంశం ఏమిటో తెలుసా? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రులకు ఘోర అవమానం జరిగిందని ఆ పత్రిక పేర్కొంది. తాము ప్రభుత్వాధినేతలమని భావిస్తున్న నాయకులకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్లెం వేయాలని నిర్ణయించిందా? ప్రభుత్వం కన్నా పార్టీయే సుప్రీం అనే మెసేజ్ ఇవ్వాలని భావించిందా? అనే ప్రశ్నలతో తన వార్తా కథనాన్ని కొనసాగించింది. ఢిల్లీలో జరిగిన పీసీసీ సమన్వయ కమిటీ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లిఖార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా కొట్టగా, వారి స్థానంలో సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచంద్ రెడ్డిని పంపించగా, ఆయన అధ్యక్షత వహించారని ఆ పత్రిక నివేదించింది. మొత్తంగా సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్రానికి చెందిన ఇతర కీలక నేతలను తక్కువ చేసే ఉద్ధేశంతోనే హైకమాండ్  ఈ ఎత్తుగడ వేసిందని, రాష్ట్ర నాయకులకు ఘోర అవమానం జరిగిందని గులాబీ పార్టీ పత్రిక తన వార్తా కథనంలో ఉటంకించడమే ఆసక్తికర అంశం.

ఇంతకీ ఈ ఫొటోలోని దృశ్యంలో టేబుల్ కు ఎవరు ఎటువైపు కూర్చున్నారనే అంశాన్ని గమనిస్తే గోచరిస్తున్న భావమేంటి..? సమన్వయ కమిటీ సమావేశానికి అధ్యక్సత వహించిందెవరు? మీనాక్షి నటరాజనా? వంశీచంద్ రెడ్డా? అదీ అసలు ప్రశ్న.

Popular Articles