ఖమ్మం: వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఖరారయ్యారు. ఆయా స్థానం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా రిటైర్డ్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావును ఖరారు చేసినట్లు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ వెల్లడించారు. ఖమ్మంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్రంలో సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై పార్టీ కేడర్ తో చర్చించనున్నట్లు చెప్పారు. జనసేన మద్ధతు లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా ఖమ్మంలో మున్సిపల్ మేయర్ పదవిని అధిష్టించలేదని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన గడల శ్రీనివాసరావు తదితరులు కూడా పాల్గొన్నారు.

