Top 5 This Week

Related Posts

హైకమాండ్ చెప్పింది: సిద్ధరామయ్య భావోద్వేగం

బెంగళూరు: కర్నాటక రాష్ట్ర సీఎం పదవికి కాంగ్రెస్ నాయకుడు సిద్దరామయ్య గురువారం రాజీనామా చేశారు. దీంతో సిద్ధరామయ్యకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కు మధ్య గడచిన మూడేళ్లుగా కొనసాగుతున్న వివాదానికి తెరపడిందనే చెప్పాలి. వీరిద్దరి మధ్య వివాదం కొన్ని సందర్భాల్లో పార్టీ ప్రభుత్వాన్ని పక్కన పెట్టడమే కాక, దానిని అస్థిరపరిచేంత తీవ్రస్థాయికి కూడా చేరిందనే వ్యాఖ్యలు ఉన్నాయి. తన తర్వాత ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సిద్ధరామయ్య ఈ సందర్బంగా ధృవీకరించడం విశేషం.

రాజీనామా సందర్భంగా సిద్ధరామయ్య విలేకరులతో మాట్లాడుతూ, ‘రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ నా రాజీనామాను ఆమోదిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించాను’ అని అన్నారు. పదవికి రాజీనామా చేసే సమయంలో శివకుమార్, ఇతర కేబినెట్ సహచరులు కూడా సిద్ధరామయ్యతో పాటు లోక్‌భవన్‌కు వెళ్లారు. హైకమాండ్ ఆదేశించినప్పుడల్లా తాను రాజీనామా చేస్తానని పలుమార్లు స్పష్టం చేశానని కూడా సిద్ధరామయ్య ఈ సందర్బంగా తెలిపడం గమనార్హం.

సిద్దరామయ్య మద్దతుదారులు ఆయనను కలిసినప్పుడు, ఆయన పాదాలకు నమస్కరిస్తూ కన్నీటి పర్యంతం కావడంతో అక్కడ భావోద్వేగభరిత దృశ్యాలు కనిపించాయి. పదవికి రాజీనామా చేసిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కర్ణాటక రాజకీయాల్లో సీఎం పదవిని ఒకటి కంటే ఎక్కువసార్లు అలంకరించిన ఎంపిక చేసిన ప్రముఖుల సరసన చేరడం ప్రత్యేకత. ఈ జాబితాలో ఎస్. నిజలింగప్ప, వీరేంద్ర పాటిల్, డి. దేవరాజ్ ఉర్స్, రామకృష్ణ హెగ్డే, హెచ్.డి. కుమారస్వామి, బి.ఎస్. యడియూరప్ప వంటి వారు ఉన్నారు.

తన రాజకీయ జీవితంలో సిద్ధరామయ్య 12 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి, వాటిలో తొమ్మిదింటిలో గెలుపొందారు. 17 రాష్ట్ర బడ్జెట్‌లను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఆయన పేరిట ఉంది. గురువారం ఉదయం సిద్ధరామయ్య తన కేబినెట్ సహచరులను అల్పాహారానికి ఆహ్వానించి, తన రాజీనామా వార్తను వెల్లడించారు. ‘కాంగ్రెస్ హైకమాండ్ డీకేఎస్‌ను తదుపరి ముఖ్యమంత్రిగా ప్రతిపాదించింది.. నేను దీనికి అంగీకరించాను.’ అని ఆయన అంతకుముందు తన బెంగళూరు నివాసంలో, కాబోయే ముఖ్యమంత్రితో సహా కేబినెట్ సభ్యులతో జరిగిన అల్పాహార సమావేశంలో పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, విపక్ష భారతీయ జనతా పార్టీ నుండి రాబోయే అనివార్యమైన విమర్శలను ఎదుర్కోవడానికి పార్టీ రాష్ట్ర విభాగం కూడా తన ఎక్స్ ఖాతాలో ‘కలిసికట్టుగా మనం ఐక్యంగా ఉన్నాం’ అనే పోస్ట్‌ను ప్రచురించింది. ఇది వారి ఐక్యతను బహిరంగంగా ప్రదర్శించే ఒక ప్రదర్శన. ఇద్దరు నాయకులు కౌగిలించుకుంటున్న, కలిసి కూర్చున్న ఫోటోలతో పాటు ‘ఆ రోజు, ఈ రోజు, ఎప్పటికీ… ఐక్యతే మన బలం! ప్రజా సేవ మన శాశ్వత నిబద్ధత’ అనే సందేశం ఉంది. ‘నేను తప్పుకుంటున్నాను’ అనే సందేశాన్ని సిద్ధరామయ్య ఇవ్వగానే శివకుమార్ మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు. వారిలో చాలామంది ఆయన ఇంటి వద్దకు చేరి విజయోత్సవాలు జరుపుకుంటూ, స్వీట్లు పంచుకున్నారు.

ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నాయకులతో 48 గంటల పాటు జరిగిన రహస్య సమావేశాలు, తీవ్రమైన సంప్రదింపుల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం. సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పుకునేలా ఒప్పించేందుకు, ఆయనకు రాజ్యసభ సీటుతో సహా ఒక పరిహార ప్యాకేజీని ఈ సమావేశాల్లో ప్రతిపాదించారు.

సోమ, మంగళవారాల్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ కాంగ్రెస్ అగ్ర నాయకులైన పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌లను విడివిడిగా కలిసి కలిశారు. ఈ ఏడాది కర్ణాటక నుంచి ఖాళీ కానున్న మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను గుర్తించడంపై చర్చలు జరిగాయి. ప్రియాంక గాంధీ ఈ మార్పు కోసం గట్టిగా వాదించారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Popular Articles