కదిరి: ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో ఘోర విషాద ఘటన చోటు చేసుకుంది. కదిరి మండలం కుమ్మరివాండ్లపల్లిలో ఓ ఇంట్లో డిటొనేటర్లు పేలి నలుగురు దుర్మరణం చెందగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రాథమిక సమాచారంతో కూడిన వార్తలందుతున్నాయి. క్షతగాత్రుల్లో ఘటన జరిగిన ఇంటికి అనుకుని ఉన్న నివాసాల్లోని వ్యక్తులు కూడా ఉన్నారు.
బండలు (రాళ్లు) పగులగొట్టే వృత్తిలో గల ఓ వ్యక్తి ఇంట్లో నిల్వ ఉంచిన డిటొనేటర్లు పేలి, గ్యాస్ సిలిండర్లకు అంటుకుని ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.పేలుడు ధాటికి పరిసరాల్లోని పలు ఇండ్లు ధ్వంసమయ్యాయి. గాయపడినవారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

