గువాహటి: ఇద్దరు సహచర జవాన్లను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ సీఆర్పీఎఫ్ అధికారి. ఈ ఘటన అస్సాంలోని నాగావ్ జిల్లాలో గల CRPF క్యాంపులో మంగళవారం జరిగింది. ఇదే ఘటనలో CRPFకు చెందిన మరో అధికారి కూడా గాయపడ్డారు. ఈ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కటిమారిలోని 34వ బెటాలియన్ క్యాంపులో విషాద ఘటన చోటు చేసుకుంది.
క్యాంపు మెయిన్ డోర్ వద్ద విధుల్లో గల బల్లాని ప్రేమాంబరం అనే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్ఐ) తన సహచర జవాన్లపై ఇన్సాస్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. దీంతో విష్ణుప్రసాద్ బాఘేల్, రామ్ నవల్ సింగ్ యాదవ్ అనే ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ఏఎస్ఐ మానే గోవింద్ శ్రీపుల్ గాయపడ్డారని అధికారులు పేర్కొన్నారు. గాయపడిన ఇతన్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
అయితే ఈ ఘటనకు పాల్పడిన ఏఎస్ఐ ప్రేమాంబరం ఆ తర్వాత బ్యారక్ లోనికి వెళ్ల తనను తాను కాల్చుకున్న ఆత్మహత్య చేసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. సీనియర్ సీఆర్పీఎఫ్ అధికారులు, పోలీసు అధికారలు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాల్పులకు పాల్పడి ఆత్మహత్య చేసుకున్న ఏఎస్ఐ ప్రేమాంబర ఆంధ్రప్రదేశ్ కు చెందిన అధికారిగా ఉన్నతాధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు దారి తీసిన పరిణామాలపై పూర్తి సమాచారం వెల్లడి కావలసి ఉంది.

