Top 5 This Week

Related Posts

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, సీజేపీ రియాక్షన్

ఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. పరీక్షల్లో అక్రమాలు, నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారాలపై తన రాజీనామాను కోరుతూ ఢిల్లీలో విద్యార్థులు నెల రోజుల పాటు చేపట్టిన భారీ ఆందోళనల నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ప్రధాన్ శనివారం నాడు తన రాజీనామా లేఖను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి పంపారు.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP), కేంద్రం మధ్య మూడవ విడత చర్చలకు కొన్ని గంటల ముందు ఆయన తన ‘X’ (ట్విట్టర్) ఖాతా ద్వారా తన రాజీనామా విషయాన్ని ప్రకటించారు. ప్రధాన్ రాజీనామా అనంతరం కేంద్ర మంత్రులు జె.పి. నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సమావేశమైన CJP, శనివారం సాయంత్రం తమ నిరసనను విరమిస్తున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెల రోజులకు పైగా ఆందోళన చేస్తున్న వారి ప్రధాన డిమాండ్ ప్రధాన్ రాజీనామానే కావడం గమనార్హం. ప్రధాన్ రాజీనామా డిమాండ్ విషయంలో CJP, కేంద్రం మధ్య చర్చలు ప్రతిష్టంభనలో పడ్డాయి. ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించడానికి ప్రభుత్వం నిరాకరిస్తే ఎటువంటి చర్చలు జరగవని CJP శనివారం ఉదయం స్పష్టం చేసింది.

  • ఆందోళనకారులు లేవనెత్తిన ప్రధాన డిమాండ్లు ఇవీ:
  • ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.
  • నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు.
  • నీట్ పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం.

మంత్రులతో మూడవ విడత చర్చల తర్వాత, కేంద్రం తమ డిమాండ్లకు అంగీకరించిందని, అందుకే నిరసనను విరమిస్తున్నామని CJP ప్రకటించింది.

కాగా “ఈ దేశ యువత ఆశయాలు, భావోద్వేగాలు, న్యాయమైన అంచనాల పట్ల నాకు ఎంతో గౌరవం ఉంది. భారత యువత కలలను సాకారం చేయడం మా రాజకీయ, సామాజిక జీవితంలో ఒక నైతిక సంకల్పంగా ఉంది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి దూరదృష్టితో కూడిన నాయకత్వంలో దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.” అని తన రాజీనామాను ప్రకటిస్తూ చేసిన ‘X’ పోస్ట్‌లో ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

“దేశ యువశక్తి గందరగోళం అనే వలలో చిక్కుకుపోకుండా చూసుకోవాలన్నది నా సంకల్పం,” అని కూడా ప్రధాన్ అన్నారు. జంతర్ మంతర్ వద్ద, దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దేశ వ్యతిరేక శక్తులు తమకు అనుకూలంగా మలుచుకోకుండా చూడటం, దేశ సమగ్రతను కాపాడటం, భారతీయ విద్యార్థి ఎవరి భవిష్యత్తూ చట్టపరమైన చిక్కుల్లో పడకుండా చూడటం, మన పిల్లలు తమ సమయాన్ని చదువులకు, కెరీర్ నిర్మాణానికి కేటాయించేలా చూడటం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని… నేను గౌరవనీయులైన ప్రధాన మంత్రికి నా రాజీనామాను సమర్పించాను.” అని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్త తెలియగానే జంతర్ మంతర్ వద్ద నిరసన స్థలంలో సంబరాలు మిన్నంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వార్తపై సీజేపీ స్పందిస్తూ, “విద్యార్థి శక్తి వర్ధిల్లాలి.” అని పోస్ట్ చేసింది. “మేము సాధించాం,” అని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే జంతర్ మంతర్ వేదికపై ప్రధాన్ రాజీనామా వార్తను ప్రకటిస్తూ వ్యాఖ్యానించారు. “ఈ ప్రభుత్వంలో ఎవరూ రాజీనామా చేయరని అంటుండేవారు. కానీ మేము దాన్ని చేసి చూపించాం’ అని కూడా అన్నారు.

Popular Articles