హైదరాబాద్: ఆరుగురిని దారుణంగా హత్య చేసిన పార్వతి రాజ్ కుమార్ (30) ఆత్మహత్య చేసుకున్నాడు. రాజ్ కుమార్ మృతదేహం రంగారెడ్డి జిల్లా కొత్తూరు వద్ద గల ఓ రియల్ ఎస్టేట్ వెంచర్ సమీపాన ఉండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహం రాజ్ కుమార్ దేనని పోలీసులు గుర్తించారు. రాజ్ కుమార్ మృతదేహం పక్కన పాయిజన్ బాటిల్ లభ్యం కావడంతో అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.

గత శుక్రవారం రాత్రి రాజ్ కుమార్ షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరుగురిని దారుణం గా పీకలు కోసి హత్య చేసిన సంగతి తెలిసిందే. తన భార్య, ఇద్దరు కుమారులను, పదిహేడేళ్ల బాలికను, ఆమె తల్లిని, నానమ్మను రాజ్ కుమార్ పొట్టనబెట్టుకున్నాడు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. రాజ్ కుమార్ ను పట్టుకునేందుకు దాదాపు 14 టీంల పోలీసులు గాలిస్తున్న పరిణామాల్లోనే అతను ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.


