దంతెవాడ: బస్తర్ లోని దంతెవాడ జిల్లా కేంద్రంలో ఛత్తీస్ గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. మావోయిస్టుల ఏరివేతకు నిర్దేశించుకున్న తుది గడువు మార్చి 31వ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో రాజధాని రాయపూర్ కేంద్రం నుంచి దాదాపు 360 కి.మీ. దూరంలో గల దంతెవాడలో బస్తర్ డివిజనల్ పోలీసు అధికారులతో ఆయన ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మావోయిస్టులపై వ్యూహాత్మక ఒత్తిడిని పెంచే దిశగా ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది.
దాదాపు నాలుగు గంటలపాటు నిర్వహించిన ఈ సమావేశంలో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల ప్రస్తుత స్థితి, నిఘా వర్గాల సమాచారం, దుర్భేద్య నక్సల్ స్థావరాల గుర్తింపు, రానున్న రోజుల్లో ఎంచుకున్న లక్ష్యపు కార్యాచరణ ప్రణాళికపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించినట్లు అధికార వర్గాలు చెప్పాయి. నక్సల్ ఏరివేత చర్యలను మరింత ముమ్మరం చేస్తూ, క్షేత్యస్థాయిలో తీసుకోవలసిన వేగవంతమైన చర్యలపై, అనుసరించాల్సిన సమన్వయంపై చర్చించారు. తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇంకా మిగిలి ఉన్న కేంద్రీకృత కార్యకలాపాలపైనా దృష్టి సారించినట్లు ఆ వర్గాలు స్పష్టం చేశాయి. భద్రతా పరంగా తీసుకోవలసిన చర్యలను ప్రాంతాలవారీగా అంచనావేసి, సెంట్రల్ ఫోర్స్, జిల్లా బలగాల మధ్య సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణ అమలు దిశగా బ్లూ ప్రింట్ ను రూపొందించారు.
కాగా గ్రౌండ్ రియాలిటీని ప్రత్యక్షంగా తెలుసుకోవడం, అందుకు అనుగుణంగా వ్యూహాన్ని రూపొందించే లక్ష్యాన్ని ఎంచుకునే దిశగా బస్తర్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించినట్లు ఛత్తీస్ గఢ్ డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ చెప్పారు. బస్తర్ ఏరియాలో నక్సలైట్లు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, వాళ్లు ఇంకా పురోగమించే అవకాశం తక్కువగా ఉన్నట్లు తాము విశ్వసిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు చేపడుతున్న ఆపరేషన్లపై సమగ్రమైన అంచానా వేశామని, రాబోయే రోజుల్లో సరికొత్త వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు డీజీపీ చెప్పారు.
కాగా మావోయిస్టులను ఉద్ధేశించి డీజీపీ అరుణ్ దేవ్ గౌతమ్ ఈ సందర్భంగా స్పష్టమైన పిలుపునిచ్చారు. లొంగిపోయే మార్గం నక్సలైట్లకు ఇంకా తెరిచే ఉందన్నారు. సమయం మించిపోతోందని, లొంగిపోవడమే నక్సల్స్ ముందున్న ఏకైక ఆప్షన్ గా ఆయన పేర్కొన్నారు. ఆయుధాలను విడిచి లొంగిపోయే నక్సల్స్ మెరుగైన జీవనం కోసం పునరావాస విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఈ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో అదనపు డీజీ (ఆపరేషన్స్) వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తోపాటు డివిజన్ లోని అన్ని జిల్లాల ఎస్పీలు, సీఆర్పీఎఫ్, ఇతర భద్రతా బలగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
