హైదరాబాద్: వచ్చే మార్చి నెలాఖరు వరకు నక్సల్స్ రహిత దేశంగా ప్రకటిస్తామని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఛత్తీస్ గఢ్ అడవులను భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మల్లోజుల వేణుగోపాల్, తక్కళ్లపల్లి వాసుదేవరావు వంటి కేంద్ర కమిటీ సభ్యులు సహా వందలాది మంది నక్సల్స్ ఆయుధాలు సహా ప్రభుత్వానికి లొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా 576 మంది మావోయిస్టులు తెలంగాణా పోలీసుల ఎదుట లొంగిపోయారు.
ఇలా అజ్ఞాతం వీడుతున్న మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో స్థిరపడే దిశగా తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ అండగా నిలుస్తున్నది. ఇందులో భాగంగానే ఇప్పటికే లొంగిపోయి గుర్తింపు లేక ఇబ్బందులు పడుతున్న వారికి ఆధార్, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ పునరావాస చర్యలను వేగవంతం చేసింది. లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస కార్యక్రమాలన్నింటినీ తెలంగాణ నిఘా విభాగానికి చెందిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) నేరుగా పర్యవేక్షిస్తోంది.

లొంగిపోయిన నక్సల్స్ కు పునరావాస ప్యాకేజీలో భాగంగా వారివారి స్వగ్రామాల్లో నివాస ధ్రువపత్రాలు ఇప్పించి, ఆధార్ నమోదు చేయిస్తున్నారు. అనంతరం పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు తెరిపించి, రివార్డు సొమ్మును అదే ఖాతాల్లో జమ చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ, ఇతర శాఖల అధికారులతో మాట్లాడి అవకాశం ఉన్న వారికి ఇళ్ల స్థలాల కేటాయింపునకు చర్యలు తీసుకుంటున్నారు. అనారోగ్య కారణాలతో జనజీవన స్రవంతిలోకి వచ్చిన పలువురికి కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు అందించారు.
ఈ నేపథ్యంలోనే “పోరు వద్దు – ఊరు ముద్దు. అజ్ఞాతం వీడి జనంలోకి రండి. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పునరావాసం కల్పిస్తాం” అని మిగిలిన మావోయిస్టులకు రాష్ట్ర పోలీస్ శాఖ పిలుపునిచ్చింది. తెలంగాణ నుంచి అజ్ఞాతంలోకి వెళ్లి ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ కమిటీల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న మావోయిస్టు క్యాడర్ల వివరాలు వివరాలను పోలీస్ శాఖ విడుదల చేసింది. మొత్తం 17 మంది తెలంగాణాకు చెందినవారు మావోయిస్టు పార్టీలో ఉన్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. వీళ్లందరూ జనజీవన స్రవంతిలో కలిస్తే మోస్ట్ వాంటెడ్ లిస్టులో గల లాస్ట్ (చివరి) నక్సలైట్లు వీళ్లే అవుతారని తెలంగాణా పోలీస్ శాఖ భావిస్తోంది.

- ముప్పాళ్ల లక్ష్మణ్ రావు @ గణపతి – కేంద్ర కమిటీ సభ్యుడు (CCM & PBM), రివార్డు రూ.25 లక్షలు.
- తిప్పిరి తిరుపతి @ దేవ్ జీ – CCM, PBM & జనరల్ సెక్రటరీ, రివార్డు రూ.25 లక్షలు.
- మల్లా రాజిరెడ్డి @ సంగ్రామ్ – కేంద్ర కమిటీ సభ్యుడు, రివార్డు రూ.25 లక్షలు.

- పుసునూరి నరహరి @ సంతోష్ – CCM, ఈఆర్బీ సభ్యుడు (జార్ఖండ్లో కార్యకలాపాలు), రివార్డు రూ.20 లక్షలు.
- ముప్పిడి సాంబయ్య @ సుదర్శన్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, డివిజనల్ కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.
- వార్తా శేఖర్ @ మంగ్తు – డీకేఎస్జెడ్సీ సభ్యుడు, కమ్యూనికేషన్ వింగ్ ఇన్చార్జి, రివార్డు రూ.20 లక్షలు.
- జోడే రత్నబాయి @ సుజాత – CCM, డీకేఎస్జెడ్సీ ఇన్చార్జి, రివార్డు రూ.20 లక్షలు.
- లోకేటి చందర్ రావు @ ప్రభాకర్ – వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి, రివార్డు రూ.20 లక్షలు.
- బడే చొక్కారావు @ దామోదర్ – రాష్ట్ర కమిటీ సభ్యుడు, సైనిక వ్యవహారాల ఇన్చార్జి, రివార్డు రూ.20 లక్షలు.
- నక్కా సుశీల @ రేలా, డీసీఎం స్థాయి కేడర్ రివార్డ్ 5 లక్షలు
- జాడి పుష్ప @ రాజేశ్వరి – డీసీఎం స్థాయి కేడర్లు, రివార్డు రూ.5 లక్షలు చొప్పున.
- రంగబోయిన భాగ్య @ రూపి, ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4. లక్షలు
- బాదిషా ఉంగ @ మంతు ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు నాలుగు లక్షలు
- మడివి అడుమె @ సంగీత, ఏరియా కమిటీ స్థాయి కేడర్ రివార్డు 4 లక్షలు
- కాశపోగు భవాని @ సుగుణ ఏరియా కమిటీ స్థాయి క్యాడర్ రివార్డు 4 లక్షలు,
- కుంజం ఇడమల్ – ఏరియా కమిటీ స్థాయి కేడర్లు, రివార్డు రూ.4 లక్షలు చొప్పున.
- ఉతిమి అనిల్ కుమార్ @ భగత్ సింగ్ – పార్టీ సభ్యుడు, కంప్యూటర్ ఆపరేటర్, రివార్డు రూ.1 లక్ష.

