ఛత్తీస్ గఢ్: మావోయిస్ట్ నక్సల్స్ ఏర్పాటు చేసిన మందుపాతర పేలి సీఐ సహా ముగ్గురు పోలీసులు మృతి చెందగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్ గఢ్ లోని కాంకేర్-నారాయణ్ పూర్ జిల్లా ఛోటెబెతియా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది.
బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి. కథనం ప్రకారం… గడచిన కొన్ని నెలలుగా లొంగిపోయిన నక్సల్స్ అందించిన సమాచారం, ఇతర ఆధారాల మేరకు మావోయిస్టులు అమర్చిన మందుపాతరల కోసం బస్తర్ రేంజ్ పోలీసులు గాలిస్తున్నారు. ఇందులో భాగంగానే భద్రతా దళాలు వందలాది మందుపాతరలను కనిపెట్టి నిర్వీర్యం చేశారు.

శనివారం కూడా ఇదే తరహాలో నక్సల్స్ అమర్చిన మందుపాతరలను వెలికితీసి నిర్వీర్యం చేస్తుండగా, ప్రమాదవశాత్తు మందుపాతర పేలి నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సీఐ సుఖ్ రామ్ వట్టితోపాటు కానిస్టేబుళ్లు కృష్ణ కొమ్రా, సంజయ్ గడ్పాలే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో కానిస్టేబుల్ పరమానంద్ కొమ్రాను మెరుగైన చికిత్స కోసం తరలించారు. ఈ ఘటనను ప్రమాదవశాత్తు ఘటనగా బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పి. ప్రకటించారు.

