Friday, January 23, 2026

Top 5 This Week

Related Posts

కాలానికి తగ్గట్టు మారాల్సిందే కామ్రేడ్స్..! ఖమ్మంలో సీపీఐ వందేళ్ల ఉత్సవంపై విశ్లేషణ

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత జయంతి ముగింపు ఉత్సవాలకు కమ్యూనిస్టుల ఎర్రకోట ఖమ్మం ముస్తాబైంది. ఈనెల 18వ తేదీన ఖమ్మం నగరంలో జరిగే పార్టీ నూరేళ్ల పండక్కి జనం ప్రత్యేకించి కమ్యూనిస్టు శ్రేణులు బాగానే కదం తొక్కుతాయి. ఇదే జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పార్టీ కార్యదర్శి కావడం ల్ల అటు జన సమీకరణలో, ఇటు ఏర్పాట్లలోనూ ఎటువంటి లోటు ఉండకపోవచ్చు.

శత వార్షికోత్సవాల ర్యాలీ తర్వాత మూడు రోజుల పాటు జరిగే సీపీఐ జాతీయ సమితీ సమావేశాలు, ఇతర కార్యక్రమాలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీల ప్రధాన కార్యదర్శులు డి.రాజా, ఎం.ఏ.బేబీ సహా 40 దేశవిదేశాలకు చెందిన వామపక్ష పార్టీల నేతలు పాల్గొనబోతున్నారు. ఇవన్నీ ఎలా ఉన్నా కాలపరీక్షకు తట్టుకుని ఎర్ర జెండా రెపరెప లాడుతోంది. ప్రస్తుత సంక్షోభ సమయంలో సీపీఐ ఈ వందేళ్ల ఉత్సవ ముగింపు సభ ఏ పిలుపును ఇవ్వ బోతోందన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరూ ఎదురూ చూస్తున్న అంశం.

భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ)కి సుసంపన్నమైన చరిత్ర ఉంది. 1917 నాటి రష్యా విప్లవం ప్రపంచాన్ని కుదిపేసింది. ఆ విప్లవ కెరటాలు… నదీనదాలను, హిమాలయాలను దాటి బ్రిటిష్ పాలనలో ఉన్న భారతదేశాన్నీ తాకాయి. వందేళ్ల కిందట ఆంగ్లేయుల పాలన కాలంలో భారతదేశంలో పరస్పర విరుద్ధమైన రెండు సిద్ధాంతాలు- సంస్థల రూపులను సంతరించుకున్నాయి. ఒకటి భారత కమ్యూనిస్టు పార్టీ మరొకటి – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS). స్వాతంత్య్ర పోరాటంతో ఏ సంబంధంలేని RSS నేటికి అపూర్వ శక్తిగా ఎదిగింది. అదే సమయంలో త్యాగాల పురుడు పోసుకు పుట్టిన సీపీఐ ఎన్నో ఘన విజయాలు సాధించినప్పటికీ నేడు అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది.

ఈ విరుద్ధ శక్తుల మధ్య సాగిన సీపీఐ వందేళ్ల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడం, మున్ముందు ఏమి చేయాలో నిర్ణయించుకోవడం ప్రధానం. 1920లోనే విదేశాల్లోని భారతీయులు ఓ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. కానీ అది ముందుకు సాగలేదు. చరిత్రకారుడు సుమిత్ సర్కార్ చెప్పినట్టు– భారత కమ్యూనిజం వేర్లు జాతీయ ఉద్యమం నుంచే పుట్టాయి. విప్లవకారులు, ఉద్యమకారులు, ఖిలాఫత్ ఉద్యమంలో పాల్గొన్నవారు, కార్మికులు, కర్షకులు వీళ్లంతా రాజకీయ, సామాజిక విముక్తికి కొత్త దారులు వెతుకుతున్నారు.

అదేవిధంగా 1924-25 నాటికి భారతదేశంలో ఒక బలమైన వామపక్ష ధార ఉద్భవించింది. రాజకీయ స్వాతంత్య్రం మాత్రమే కాదు, సామాజిక–ఆర్థిక విముక్తి కూడా లక్ష్యంగా మారింది. 1925 కాన్పూర్ డిసెంబర్ 26 నుంచి 28 జాతీయ సదస్సు నిర్వహించాలని బొంబాయికి చెందిన శ్రీపాద్ అమృత్ డాంగే, విప్లవకారుడు సత్యభక్త్ లాంటి వాళ్లు అనేకమంది అనుకున్నారు. దాదాపు 500 మంది ప్రతినిధులు వచ్చారు. అక్కడే భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) అధికారికంగా అవతరించింది.

మౌలానా హస్రత్ మోహాని మాటల్లో:
“కమ్యూనిజం రైతులు, కార్మికుల ఉద్యమం. సంపూర్ణ స్వాతంత్య్రమే మా లక్ష్యం.” అనే నినాదాలు స్పష్టంగా ఉన్నాయి. బ్రిటిష్ సామ్రాజ్యవాదం హడలెత్తింది. ‘బోల్షెవిక్ ప్రమాదం’పై నిఘా పెరిగింది. కాన్పూర్, మీరట్, లాహోర్, పెషావర్ కుట్రకేసులు, అరెస్టులు, అక్రమ నిర్బంధాలు, కోర్టులు, కఠిన కారాగార శిక్షలు షరా మామూలయ్యాయి. లాహోర్ కేసులో భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు ఉరి కంభం ఎక్కారు. ఉరి తప్పించుకున్న అజయ్ ఘోష్ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యారు. కాంగ్రెస్‌లో కమ్యూనిస్టుల ప్రభావం పెరిగింది. ఆల్ ఇండియా ట్రేడ్ యునియన్ కాంగ్రెస్, కిసాన్ సభ, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఇండియన్ పీపుల్స్ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్, అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ పుట్టాయి. వామపక్ష ఆలోచనలు దేశమంతా విస్తరించాయి. సీపీఐ అగ్రనేత పీసీ జోషి చెప్పినట్టు “జాతీయ పోరాటమే అతిపెద్ద వర్గ పోరాటం” అయింది. స్వాతంత్య్రం సిద్ధించింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఉవ్వెత్తున సాగి అసమాన త్యాగాలతో కొన్ని విజయాలు సాధించింది.

ఈ నేపథ్యంలోనే 1951–52 పార్లమెంటు ఎన్నికలు వచ్చాయి. సీపీఐ దేశంలో రెండో పెద్ద పార్టీ. ఇక అధికారమే తరువాయి అనుకునే దశ.. కుట్రలు, కుతంత్రాలు మొదలు.. 1964 వరకు మూడు లోక్‌సభల్లో ప్రధాన ప్రతిపక్షం. 1957లో కేరళ రాష్ట్రంలో పార్లమెంటరీ విధానంలో ఆవిర్భావించిన తొలి కమ్యూనిస్టు ప్రభుత్వం. అంతే… ప్రపంచం నివ్వెరపోయింది. స్వేచ్ఛాయుత ఎన్నికల ద్వారా కమ్యూనిస్టు ప్రభుత్వమా! అని ఆశ్చర్యపోయింది. 1959లో కేరళపై కాంగ్రెస్ కుతంత్రం.. EMS నంబూద్రిపాద్ ప్రభుత్వం బర్తరఫ్. రాష్ట్రపతి పాలన. కమ్యూనిస్టు పార్టీ ఆలోచనా ధోరణుల్లో మార్పు. మార్క్స్, ఏంగెల్స్, లెనిన్, స్టాలిన్, మావో.. మొదటి ముగ్గురు అందరికీ ఓకే.. చివరి ఇద్దరితో తేడా.. వ్యూహాల మార్పు.. నిషేధాలు. సభ్యత్వ పతనం. 1964లో సీపీఐలో మహా చీలిక. CPI(M) అవతరణ జరిగింది.

1990లో సోవియట్ యూనియన్ పతనం నాటికే ఇండియాలో కమ్యూనిస్టు పార్టీలు తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడా పరిస్థితి మరింత తీవ్రస్థాయికి చేరింది. బీహార్, బెంగాల్, ఆంధ్ర, తెలంగాణ వంటి కమ్యూనిస్టు కోటలు బద్దలయ్యాయి. అసెంబ్లీలలో సీట్లే లేకుండా పోయాయి.
కేరళలో సీపీఎం అధికారంలో ఉంటే సీపీఐ భాగస్వామిగా మిగిలింది. అయితే ఓ సిద్ధాంతాన్ని నమ్ముకున్న పార్టీ స్థాయిని, శక్తిని అనేకానేక ప్రలోభాలకు ప్రభావితమవుతున్న ఎన్నికల సీట్ల ఫలితాలతోనే కొలవాలా? అవసరం లేకపోవచ్చు. కానీ ప్రతి చీలికా అనివార్యమా, నివార్యమా? అనేది మాత్రం కచ్చితంగా చర్చించాల్సిందే.

కమ్యూనిస్టుల ప్రాబల్యం తగ్గబట్టే ఇవాళ అత్యంత ప్రమాదకర మతోన్మాద, సంకుచిత, విధ్వంసకర శక్తులు విజృంభించాయి. వాటిని కట్టడి చేయాల్సిన కమ్యూనిస్టులు కురచబారిపోయారు. సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక చారిత్రక తప్పిదాలకు పాల్పడ్డామని అనేక సార్లు బహిరంగంగా చెప్పుకోవాల్సిన దుస్థితి.

వామపక్ష –ప్రజాస్వామ్య ఐక్యత” :
ఒక వ్యూహం, ఒక వాదన
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా కమ్యూనిస్టులు ఇప్పుడు మాట్లాడుతున్న మాట వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. ఈ మాట కొత్తదేమీ కాదు. 45,50 ఏళ్లుగా వింటున్నదే. చీలికలు పీలికలైన కమ్యూనిస్టులు, మార్క్సిస్టులు, కొన్ని తీవ్రవాద కమ్యూనిస్టు పార్టీలు, గ్రూపుల- రాజకీయ ఆలోచనల్లో ఇదో వ్యూహాత్మక–సైద్ధాంతిక కార్యాచరణ భావన. ఎన్నికల కూటముల పైనే కాకుండా ప్రజా పోరాటాల మీద ఆధారపడే ఒక రాజకీయ ఫ్రేమ్‌వర్క్.

ఈ “వామపక్ష –ప్రజాస్వామ్య ఐక్యత” అంటే ఏమిటి? ఇది ఎన్నికల ఒప్పందమా? ప్రజా ఉద్యమాల సమాహారమా లేక దేశ రాజకీయ దిశను మార్చాలనే వ్యూహమా? CPI(M), CPI పత్రాల్లో ఈ భావన ఎలా రూపొందింది? తాజాగా CPI–CPI(M) మధ్య వచ్చిన విమర్శలు ఈ చర్చను ఎందుకు మళ్లీ ముందుకు తెచ్చాయి? అనేవి కూడా జవాబు లేని ప్రశ్నలే.

దేశంలో వామపక్ష భావజాల ప్రభావం ఉన్న ప్రజాస్వామ్య–లౌకిక శక్తులన్నిటిని ఒక తాటిపైకి తెచ్చి కూటమిగా ఉంచడం దీని లక్ష్యం. ఎన్నికలప్పుడే కాకుండా ఇతరత్రా ఉద్యమాల్లోనూ కలిసొచ్చే రాజకీయ పార్టీలు, ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమైక్య సామాజిక ఉద్యమాలు నిర్వహించడం ఉద్దేశం.

ఈ ఐక్యత లక్ష్యాలు ఏమిటి?
మొదటిది- దేశంలో బూర్జువా–భూస్వామ్య పార్టీల ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం. (గతంలో కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీ). వీటి ప్రైవేటీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రతిఘటించడం. రెండోది- సామాజిక దోపిడీకి, మతతత్వ రాజకీయాలపై పోరాటం, ప్రత్యేకంగా RSS–BJP ముందుకు తెచ్చిన హిందుత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడడం. కుల, మత, లింగ వివక్ష, అసమానత వంటి సమస్యలను రాజకీయ అజెండాగా మార్చడం.

మూడోది- సామాజిక న్యాయం, లౌకికత్వం, భూ సంస్కరణలు, కార్మిక వర్గ హక్కులు, ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యం వంటి సమస్యలపై పోరాడడం.
ప్రజాస్వామ్య విప్లవం లేదా సామ్యవాద సమాజం వైపు దేశాన్ని నడిపించడం లక్ష్యం.

ఈ ఐక్యత కేవలం ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు లేనప్పుడు కూడా నిరంతర ప్రజా పోరాటాల ద్వారా కింది స్థాయిలో వివిధ సామాజిక శక్తుల సమతుల్యతను కాపాడడమే దీని లక్ష్యం. ఇందులో పాల్గొనే వామపక్ష పార్టీలు తమ సొంత సిద్ధాంతాలను, గుర్తింపును కాపాడుకుంటూనే ఇతర ప్రజాస్వామ్య శక్తులతో సహకరిస్తాయి. ఈ భావన ప్రాంతాలవారీగా రకరకాలుగా ఉంది.

1988లలో “వామ–లౌకిక శక్తుల ఐక్యత”, తర్వాత “వామ, ప్రజాస్వామ్య, లౌకిక శక్తుల ఐక్యత”, యునైటెడ్ ఫ్రంట్ పతనం తరువాత “మూడో ప్రత్యామ్నాయం”, ఇప్పుడు ఇండియా (Indian National Developmental Inclusive Alliance (I.N.D.I.A.) కూటమి.

ఇవిగాక కేరళలో ప్రత్యేకంగా ఎల్.డి.ఎఫ్. (Left Democratic Front), బెంగాల్, త్రిపురలో ఎల్.ఎఫ్. (లెఫ్ట్ ఫ్రంట్), బీహార్ లో మహాఘటబంధన్ (Mahagathbandhan), తమిళనాడులో లౌకిక ప్రగతిశీల శక్తుల సంఘటన (Secular Progressive Alliance), మణిపూరులో Manipur Progressive Secular Alliance, మహారాష్ట్రలో Maha Vikas Aghadi, ఆంధ్రాలో లెఫ్ట్ ఫ్రంట్ అని ఓసారి, తృతీయ ఫ్రంట్ అని మరోసారి, తెలంగాణలో సీపీఎం వారి Bahujan Left Front (BLF) (ఇందులో సీపీఐ లేదు, ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ తో పొత్తు).. ఇలా ఎన్నో ఫ్రంట్లు, కూటములు.

ఇన్ని ఉన్నా కమ్యూనిస్టు పార్టీలు మాత్రం “ఇది కేవలం ఎన్నికల కూటమి కాదు, ఒక ఉమ్మడి ప్రోగ్రాం ఆధారంగా రావాలి” అని తెగేసి చెబుతుంటాయి. క్రమంగా… ఆ ఉమ్మడి ప్రోగ్రాం ఎంతో కష్టమన్న ఒప్పుకోలు కూడా పత్రాల్లో కనిపిస్తుంది.

నిజంగానే ఈ ప్రయాణం సులభం కాదు. సిద్ధాంత విభేదాలు, అనుకూల మిత్రుల మధ్య ఊగిసలాట, వామపక్షాల సొంత బలం పెంచాల్సిన అవసరం… ఇవన్నీ ఈ ఐక్యతకు నిరంతర సవాళ్లు. స్వతంత్రతను కాపాడుకునే పేరిట ఎవరి కుంపటి వాళ్లదే. ఒకరేమో “విశాల ప్రజా సంఘాలను పోరాటంలోకి తెచ్చినప్పుడే వామ–ప్రజాస్వామ్య ఫ్రంట్ సాధ్యం” అంటారు. ఇంకొరేమో స్వతంత్ర రాజకీయ అస్తిత్వం అంటారు.

2014లో కాంగ్రెస్ నాయకత్వంలోని యునైటెడ్ ఫ్రంట్ (యూపీఏ) పతనం తర్వాత “మూడో ప్రత్యామ్నాయం” అనే నినాదం వచ్చింది. ప్రాంతీయ, లౌకిక బూర్జువా పార్టీలతో వామపక్షాల కూటమి తెరపైకి వచ్చింది. కాలక్రమంలో అదీ ఎండమావే అయింది. ప్రస్తుత వివాదం – వామ ఐక్యతపై విభేదాలు. కేరళ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ విషయం బాగా తెరపైకి వచ్చింది. సీట్లపై మీకెక్కువ మక్కువ పెరిగిందంటే మీకు పెరిగిందని సీపీఐ, సీపీఎం బాహాటంగానే విమర్శించుకున్న తీరు అందరికీ తెలిసిందే.

చిత్రమేమిటంటే వామపక్ష పార్టీలు వెళ్లి ఏ ఉదారవాద బూర్జువా పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ బలపడిందే తప్ప కమ్యూనిస్టు పార్టీలు కాదు. 1980వ దశకం నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రత్యక్ష అనుభవం ఇది. పొత్తు పెట్టుకోవడమంటే కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను ఇతర పార్టీలకు అప్పగించడమనే జనాంతిక అర్థం వచ్చింది.

మొత్తానికి “వామపక్ష –ప్రజాస్వామ్య ఐక్యత” చర్చ ఒక ప్రశ్నను ముందుకు తెస్తోంది. ఇది నిజంగా “ప్రజా ఉద్యమాల” ద్వారా నిర్మించే రాజకీయ ప్రత్యామ్నాయమా? లేక ఎన్నికల సమీకరణాల్లో మాత్రమే సాగే ఒక తాత్కాలిక ఒప్పందమా? ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తమ డాక్యుమెంటల్లో చెబుతున్నదేమిటంటే… ఈ ఐక్యత “ఎన్నికల కాన్సెప్ట్ కాదు”. ఇది ఒక ప్రక్రియ. ప్రజలను బూర్జువా–భూస్వామ్య పార్టీల ప్రభావం నుంచి వేరు చేసి, విశాల ప్రజా ఉద్యమాలు, పోరాటాల ద్వారా వామపక్ష రాజకీయాలను బలపరచడం.

కానీ ఈ ఐక్యత గ్రాస్‌రూట్ నుంచి నిర్మితమ వుతుందా? సీపీఐలో సుదీర్ఘకాలం పని చేసిన ఓ సీనియర్ నేత అభిప్రాయం ప్రకారం “కమ్యూనిస్టు పార్టీ నాయకులు గ్రామాలకు దూరమయ్యారు. పార్టీలకు రాజకీయ దృష్టి కరవైంది. కలిసి పోటీ చేసినా ఫలితం లేని పరిస్థితిని గత ఎన్నికల్లో ఆంధ్రాలో చూశాం. ప్రజలు దూరమయ్యారు. జనాన్ని వాళ్ల సమస్యలపై పోగేయాలే తప్ప మనమేదో నిర్ణయించుకుని ఉపన్యాసం చెప్తామంటే వినే రోజులు కావివి. కార్యక్రమం ముఖ్యం, ప్రచారం ప్రధానం, ప్రజాసమస్యలు పరిష్కారం కావడం అన్నింటికన్నా ముఖ్యం.

గ్రామాలకు వెళ్లి మాట్లాడేవాళ్లు కావాలిప్పుడు. ప్రజా నాడిని పట్టుకునే వారే ఇప్పుడు జనానికి అవసరం. ఇవాళ మీ దగ్గరకు వస్తే నాకేం వస్తుందని జనం అడుగుతున్నారు. దానికి జవాబు చెప్పగలిగిన స్థితిలో కమ్యూనిస్టులు లేరు. అందువల్ల నాయకులు క్రెడిబులిటీ పెంచుకోవాలి. అప్పుడే పుంజుకోగలుగుతారు. ఈ తరహా ఫ్రంటులను ఆదరించగలుగుతారు..”
వందేళ్లు…
పోరాటం…
త్యాగం…
ఆలోచన…

అంటే సరిపోదు.

కాలక్రమంలో కొడవలి పదునెక్కాలంటే రేపటి కార్యక్రమ వ్యూహము, కార్యాచరణ విధానం లోనే సమాధానం ఉంది. ఆ పని చేయనంతవరకు వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఐక్యత అనేది కేవలం నినాదం గానే మిగిలిపోతుంది. నిజానికి అదో సుదీర్ఘ ప్రయాణం. ఎన్నికలకంటే భిన్నమైనది. ప్రజా పోరాటాలతో వివిధ తరగతులు, శక్తుల మధ్య సమన్వయాన్ని సాధించేది.

“కొన్ని రోజులు భారంగా అనిపించవచ్చు, అంత మాత్రాన మీరు ఆగిపోవాలని అర్థం కాదు. పురోగమనం ఎంత నెమ్మదిగా ఉన్నా, అది పురోగతే’ అవుతుంది. ఒక ఓటమి మరో గెలుపునకు పునాది. జీవితాల్ని ఫణంగా పెట్టి కమ్యూనిస్టు పార్టీలను కాపాడుతున్న లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు, పార్టీ హోల్ టైమర్లు ఈ లక్ష్యాన్ని వదులుతారని నేననుకోను.

ప్రముఖ మార్క్సిస్ట్ సిద్ధాంతవేత్త అనిల్ రాంజివాలే చెప్పినట్టు – “ప్రజాస్వామ్య మార్గమే సరైన మార్గం. కమ్యూనిస్టులు మారుతున్న కాలానికి తగ్గట్టు మారాల్సిందే.”

Popular Articles