భూ భారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, సీసీఎల్ఏ కమీషనర్ నవీన్ మిట్టల్ లతో కలిసి శుక్రవారం హైదరాబాద్ నుంచి మంత్రి పొంగులేటి రెవెన్యూ అధికారగణంతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూ భారతి చట్టం, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, నీట్ యు.జి. ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఈ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, పైలెట్ ప్రాజెక్టు క్రింద చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై ప్రజల నుంచి మొత్తం 12 వేల 759 దరఖాస్తులు వచ్చాయన్నారు. భవిష్యత్తులో జరిగే రాష్ట్ర వ్యాప్త రెవెన్యూ సదస్సులలో ఎక్కువ మొత్తంలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. గ్రామాల్లో ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. భూ భారతి చట్టంలో దరఖాస్తు చేసుకునే సమయంలో సరిగ్గా దరఖాస్తు నమోదు అయ్యేలా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు.

ప్రభుత్వ భూములలో పొజిషన్ ఉన్న రైతుల దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించాలని, భూమి లేని నిరుపేదలు పోజిషన్ లో ఉంటే వారికి పట్టాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రితో చర్చించి సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు. పట్టాలు ఉండి పొజిషన్ లో లేని దరఖాస్తులను కూడా పరిశీలించాలన్నారు. హై కోర్టు నుంచి అనుమతి రాగానే సాదా బైనామా దరఖాస్తులు పరిష్కారం చేయాలని, దీనికి అవసరమైన కార్యాచరణ పూర్తి చేయాలని మంత్రి సూచించారు.
భూ సర్వేకు సంబంధించిన సమస్యలు, ఆర్.ఎస్.ఆర్. ఎక్సెస్ సమస్యలు పరిష్కరించాలని, భూ సేకరణ క్రింద ప్రభుత్వం సేకరించిన భూముల రికార్డులు అప్ డేట్ చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. మే నెల చివరి వరకు రెవెన్యూ సదస్సులో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి తప్పులు లేకుండా పరిష్కారం చూపాలని మంత్రి తెలిపారు. పైలట్ ప్రాజెక్టు జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాలలో ఒక మండలాన్ని పైలట్ గా తీసుకొని గ్రామాలలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలపై ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొనుటకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. అటవీ భూముల వివాదాల పరిష్కారానికి కూడా కృషి చేయాలని అన్నారు.

ప్రభుత్వం అందించే ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన నిరుపేదలకు కేటాయించాలని, ఇందిరమ్మ కమిటీల నుంచి వచ్చిన లబ్ధిదారుల జాబితాను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చెక్ లిస్ట్ రూపొందించుకొని అర్హులైన తుది జాబితాను తయారు చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక లబ్ధిదారులకు ఉచితంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. బేస్మెంట్ పూర్తి చేసుకున్న ఇళ్లకు ఇటీవలే లక్ష రూపాయలు విడుదల చేశామని, ఇంటి నిర్మాణాలలో పురోగతి రావాలని, కలెక్టర్లు హౌసింగ్ శాఖపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు.
హౌసింగ్ కోసం ప్రత్యేకంగా ప్రతి మండలానికి అసిస్టెంట్ ఇంజనీర్లను ప్రభుత్వం కేటాయిస్తుందని అన్నారు. ప్రతి రోజు ఇంచార్జి మంత్రులతో సమన్వయం చేస్తూ అర్హుల జాబితా ప్రకటించి ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించి గ్రౌండ్ చేయాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం క్రింద వార్తాపత్రికల్లో వచ్చే వ్యతిరేక వార్తలకు ఎప్పటికప్పుడు రిజైoడర్లు జారీ చేయాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో నమోదు చేయాలని, ప్రజలకు చెల్లింపులు సకాలంలో అందుతుందని మంత్రి అన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు మాట్లాడుతూ, భూ భారతి చట్టం పైలెట్ ప్రాజెక్టు క్రింద వచ్చిన దరఖాస్తులను చట్టం ప్రకారం పరిష్కరించాలని సూచించారు. అధికారులు అందుబాటులో ఉన్న సమయాన్ని దృష్టిలో ఉంచుకొని దరఖాస్తుల స్క్రూటిని మార్గం సుగమం చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి భూ భారతి దరఖాస్తుదారుల సమస్యల పరిష్కారం చేపట్టాలని అన్నారు. పేదలకు ప్రభుత్వం అందించే శాశ్వత ఆస్తి ఇందిరమ్మ ఇండ్లని, ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మమైన కార్యక్రమమన్నారు. అర్హుల జాబితా ఎంపిక చేయడం చాలా కీలకం అవుతుందని, అనర్హులకు పథకం అందితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎస్ తెలిపారు.
నీట్ యూ.జి. ప్రవేశ పరీక్షలపై చీఫ్ సెక్రటరీ మాట్లాడుతూ, గతంలో జరిగిన ఎటువంటి పొరపాట్లు పున:రావృతం కాకుండా జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. నీట్ యు.జి. ప్రవేశ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని, ఏర్పాట్లలో ఎక్కడా లోటు రాకుండా చూసుకోవాలని అన్నారు. నీట్ యు.జి. ప్రవేశ పరీక్షకు జిల్లా స్థాయిలో చేస్తున్న ఏర్పాట్ల గురించి అభ్యర్థులకు తెలిసే విధంగా పత్రికల, మీడియా ద్వారా ప్రచారం కల్పించాలని అన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ముందుగానే సకాలంలో చేరుకునేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.

