Top 5 This Week

Related Posts

నెల్లూరి కోటేశ్వర్ రావు ‘సాక్షి’గా సిరి గోల్డ్ ‘సెటిల్మెంట్’ స్టోరీ

(‘సమీక్ష’ మార్క్ స్పెషల్ స్టోరీ)
‘సిరి గోల్డ్’ సంస్థ వివాదంలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు వార్తల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. నెల్లూరి కోటేశ్వర్ రావుపైనేగాక, బీజేపీకి చెందిన సత్తుపల్లి నాయకుడు కూసంపూడి రవీంద్రపైన నమ్మకద్రోహం, ఛీటింగ్ సెక్షన్ల కింద హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు మొన్న కేసు నమోదు చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బీఎన్ఎస్ చట్టంలోని 316(2),318(4),r/w 3(5) సెక్షన్లతోపాటు 5 TSPDFEA,3,4,5 PC&MCSBA చట్టం కింద కోటేశ్వర్ రావు,రవీంద్రలపై కేసు నమోదు చేశారు. కల్లూరు మండలం చిన్న కోరుకొండికి చెందిన యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తి ఇచ్చి ఫిర్యాదు మేరకు నమోదైన ఈ కేసులో A1గా సత్తుపల్లికి చెందిన బీజేపీ నేత కూసంపూడి రవీంద్రను, A2గా ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావును పొందుపరుస్తూ హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు నిన్న మీడియాతో మాట్లాడినప్పటి చిత్రం

అయితే ఈ అంశంలో బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై దుష్ప్రచారం జరుగుతోందని, సిరిగోల్డ్ సంస్థలో తాను భాగస్వామిని కాదని, సంస్థ నిర్వాహకులు తెలుసని చెబుతూ.. ఈ కేసును చట్టపరంగా ఎదుర్కుంటామని కూడా స్పష్టం చేశారు. ప్రజాసేవకోసం, ప్రజలను ఆదుకునేందుకు, దేశం కోసం, ధర్మం కోసం నిత్యం పాటుపడుతున్నట్లు కూడా కోటేశ్వర్ రావు నిన్నటి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నెల్లూరి కోటేశ్వర్ రావుకు ‘సిరి గోల్డ్’ సంస్థతో సంబంధం ఉందా? లేదా? అనే అంశాన్ని కథనం చివరలో చెప్పుకుందాం. అంతకు ముందు ఆసక్తికర అంశమేమిటంటే.. తనపై నమోదైన కేసులో ఫిర్యాదుదారుడైన యాసా నాగేశ్వర్ రావు అంశంలో కోటేశ్వర్ రావు ఆర్థికపరమైన ‘సెటిల్మెంట్’ చేయడం గమనార్హం.

ఈ ‘సెటిల్మెంట్’కు సంబందించి జరిగిన ఒప్పంద పత్రంలోని వివరాల ప్రకారం.. సిరిగోల్డ్ సంస్థలో కష్టపడి పని చేసినందుకుగాను అన్ని అలవెన్సులతో కలిపి యాసా నాగేశ్వర్ రావు అనే వ్యక్తికి రూ. 9.00 లక్షలు చెల్లించేందుకు సిరిగోల్డ్ సంస్థ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న కూసంపూడి రవీంద్రతో ఒప్పందం జరిగింది. అటు యాసా నాగేశ్వర్ రావు, ఇటు కూసంపూడి రవీంద్రల అంగీకారంతోనే రూ. 9.00 లక్షలు చెల్లించేందుకు నిర్ణయించారు. ఈమేరకు గత మే 22వ తేదీనాటికి రూ. 3.00 లక్షలు యాసా నాగేశ్వర్ రావుకు ముట్టాయి. మిగిలిన రూ. 6.00 లక్షలు గత మే 22వ తేదీ నుంచి రెండు నెలల్లో అనగా జూలై చివరినాటికి చెల్లించే విధంగా నిర్ణయం జరిగింది. ఆయా మొత్తాన్ని దశలవారీగా ఇచ్చేందుకు నెల్లూరి కోటేశ్వర్ రావు మధ్యవర్తిత్వం వహిస్తూ ‘సాక్షి’ సంతకం పెడతారని కూడా ఒప్పంద పత్రంలో పేర్కొన్నారు. మిగులు పైకం అందిన తర్వాతనుంచి సిరి మర్చంట్ కంపెనీతో తనకు ఎటువంటి సంబంధం లేదని, తనకూ, కూసంపూడి రవీంద్రలకు మధ్య వ్యక్తిగత దూషణగాని, ఆరోపణలుగాని చేసుకోబోమని పెద్దమనుషుల సమక్షంలో తమ ఇష్టానుసారం అంగీకరిస్తున్నట్లు ఒప్పంద పత్రాన్ని రాసుకున్నారు.

ఒప్పంద పత్రం ప్రతి

ఈ ఒప్పంద పత్రంలో సాక్షి సంతకం పెడతారని పేర్కొన్న నెల్లూరి కోటేశ్వర్ రావు సంతకం కూడా ‘ఇట్లు’ కింద యాసా నాగేశ్వర్ రావు సంతకం దిగువనే ఉండడం గమనార్హం. సాక్షులు.. దిగువన బీజేపీకే చెందిన మందడపు సుబ్బారావు సంతకం ఉండగా, దస్తూరిగా మరో బీజేపీ నేత ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి సంతకం ఉంది. అంతేకాదు యాసా నాగేశ్వర్ రావుకు కొంత మొత్తాన్ని అప్పగిస్తూ, ఒప్పందపత్రంలో దిగిన ఫొటోలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వర్ రావు ఉండడం విశేషం. అయితే ఈ అంశంపై సిరిగోల్డ్ సంస్థ సీఎండీ కూసంపూడి రవీంద్ర ‘సమీక్ష’తో మాట్లాడుతూ, ఆర్థికపరమైన వివాదంలో ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వర్ రావు ఓ పెద్దమనిషిగా ‘పంచాయతీ’ మాత్రమే చేశాడని, చెల్లింపు మొత్తాన్ని సెటిల్మెంట్ చేశాడని, ఇందులో తప్పేముందని పేర్కొన్నారు. కూసంపూడి రవీంద్ర పేర్కొన్న అంశాల ప్రకారమే యాసా నాగేశ్వర్ రావుకు చెల్లించాల్సిన నగదుకు సంబంధించి నెల్లూరి కోటేశ్వర్ రావు పంచాయతీ నిర్వహణ ద్వారా ‘సెటిల్మెంట్’ చేసినట్లు స్పష్టవమతోంది.

యాసా నాగేశ్వర్ రావుతోపాటు నెల్లూరి కోటేశ్వర్ రావును డైరెక్టర్ గా సిరి గోల్డ్ సంస్థ ప్రచురించిన బ్రోచర్ లోని ఓ భాగం

ఇక అసలు విషయానికి వస్తే.. సిరిగోల్డ్ సంస్థలో తాను భాగస్వామిని కాదని కూడా నెల్లూరి కోటేశ్వర్ రావు నిన్న మీడియా సమావేశంలో పేర్కొన్నారు. కానీ ఈ సంస్థ ప్రచురించిన అందమైన కలర్ బ్రోచర్ లో నెల్లూరి కోటేశ్వర్ రావు పేరు సిరి గ్రూప్ డైరెక్టర్ గా ఫొటో సహా ఉండడం గమనార్హం. అంతేకాదు నెల్లూరి కోటేశ్వర్ రావు, కూసంపూడి రవీంద్రలపై కేసు నమోదుకు కారణమైన ఫిర్యాదుదారుడు యాసా నాగేశ్వర్ రావు కూడా డైరెక్టర్ గానే ఉన్నట్లు బ్రోచర్ లో ఉంది. వీరితోపాటు మరో ఐదుగురు వ్యక్తులు కూడా వేర్వేరు హోదాల్లో ఉన్నారు.

కూసంపూడి రవీంద్ర

ఈ అంశంపైనా ‘సమీక్ష’ సంధించిన ప్రశ్నకు సిరిగోల్డ్ సీఎండీ కూసంపూడి రవీంద్ర స్పందిస్తూ, ఆ బ్రోచర్ సంస్థ ప్రారంభ దశలో ప్రచురించిందని చెప్పారు. బ్రోచర్ లో డైరెక్టర్లుగా పేర్కొన్న వ్యక్తులు సాంకేతికంగా సంస్థలో డైరెక్టర్లు కాదని, మార్కెటింగ్ పరంగా తాము ఇచ్చిన హోదాలుగా అభివర్ణించారు. వ్యాపార నిర్వహణలో ప్రమోట్ చేసే వ్యక్తులకు ఇటువంటి హోదాలు ఇవ్వడం సహజమేనని కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థల నిర్వహణ తీరును ఆయన ఈ సందర్భంగా ఉదహరించారు. అయితే సిరిగోల్డ్ సంస్థలో నెల్లూరి కోటేశ్వర్ రావు కొంతకాలం మార్కెటింగ్ డైరెక్టర్ గా వ్యవహరించారని, బీజేపీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడైన తర్వాత అతను ఈ హోదా నుంచి తప్పుకున్నట్లు కూసంపూడి రవీంద్ర స్పష్టం చేశారు. మొత్తంగా సిరిగోల్డ్ సంస్థ వ్యవహారంలో నెల్లూరి కోటేశ్వర్ రావుపై, రవీంద్రపై నమోదైన కేసు బీజేపీలో తీవ్ర చర్చకు దారి తీసింది.

Popular Articles