బీఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) ఆదివారం కన్ను మూశారు. గుండెపోటు రావడంతో ఈనెల 5వ తేదీ నుంచి గచ్చిబౌలి ఏఐసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్ ఈ ఉదయం 5.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. గోపీనాథ్ కన్నుమూసిన విషయాన్ని ఆసుపత్రికి చెందిన వైద్యులు వెల్లడించారు.
ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న గోపీనాథ్ 2014లో తొలిసారి టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ లో చేరి వరుసగా 2018, 2023 ఎన్నికల్లో గెలుపొందారు. మొత్తం మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ మృతి ఘటన బీఆర్ఎస్ పార్టీలో తీరని విషాదాన్ని నింపింది.



