హైదరాబాద్: కనిపించకుండాపోయిన ఇద్దరు వృద్ధ మహిళలు ఓ ఫాం హౌజ్ సమీపాన దారుణ హత్యకు గురైనట్లు వెలుగులోకి వచ్చిన ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. తాండూరుకు చెందిన ఈ ఇద్దరు వృద్ధ మహిళలను మరో మహిళ ఇద్దరి సహకారంతో కిరాతకంగా హత్య చేసి, హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్ వద్ద గల ఓ ఫాం హౌజ్ సమీపాన పాతిపెట్టినట్లు పోలీసులు కనుగొన్నారు. ఓ పథకం ప్రకారమే ఈ రెండు హత్యలు జరిగినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ఖాసీంపూర్ కు చెందిన అంగన్వాడీ ఆయా అబీదా బేగం (60) కనిపించడం లేదని ఆమె కుమారుడు ఐదు రోజుల క్రితం తాండూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అబీదా బేగం చివరగా మాట్లాడిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాండూర్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన కరీం బీ అనే మహిళ తన భర్త రెహమాన్ ప్రోత్సాహంతో పక్కా ప్లాన్ ప్రకారం అబీదా బేగంను హతమార్చినట్లు పోలీసులు కనుగొన్నారు. అబీదాబేగం వద్ద తీసుకున్న రూ. 30 వేల అప్పు తిరిగి చెల్లింపు అంశంలో ఆమెను నమ్మించి ఓ ఫాం హౌజ్ సమీపాన గల నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి దారుణంగా హత్య చేసింది. ఈ సందర్భంగా అబీదా బేగం వద్ద గల మూడు తులాల బంగారు నగలను కూడా అపహరించి ఆమెను అక్కడే పూడ్చిపెట్టింది.

కాగా తాండూర్ పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకే చెందిన మరో వృద్ధ మహిళ మహబూబీ (62) కూడా రెండు నెలల క్రితం కనిపించకుండా పోయినట్లు కేసు నమోదైంది. ఈమెను కూడా రెండున్నర తులాల బంగారు ఆభరణాల కోసం నమ్మించి పథకం ప్రకారం తన భర్త రెహమాన్ తో కలిసి కరీం బీ హతమార్చింది. ఆ తర్వాత మహబూబీ శవాన్ని ఫాం హౌజ్ లోనే పూడ్చిపెట్టింది. ఈ దారుణ హత్యల్లో ఫాం హౌజ్ సెక్యూరిటీ గార్డ్ నయీం సహకరించినట్లు పోలీసులు కనుగొన్నారు. తాము చేసిన హత్యల నేరాన్ని నిందితులు కరీం బీ, రెహమాన్, నయీం అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ హత్యల నిందితులు ఇంకా ఎంత మందిని చంపేసి, ఇలా పూడ్చపెట్టారనే కోణంలోన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

