కుబేరుల సెక్స్ రాకెట్ గుట్టు విప్పిన జర్నలిస్టు జూలీ..
ఎవరమ్మా నువ్వు..? మా వాళ్లు ‘కోవా బన్’ల మీద యుద్ధం చేస్తుంటే నువ్వేమో కుబేరుల లోగుట్టు బయటపెట్టావు? బ్రిటన్ రాజును పడగొట్టావు. ఎందరెందర్నో హడలెత్తించావు. ఎలాన్ మస్క్, బిల్ గేట్స్ వంటి మహా పుణ్యాత్ముల తుచ్చ, నీచబుద్ధుల్ని ప్రపంచానికి చాటావు. ఇంతకీ ఎవరు నువ్వు?
కథ ఇలా మొదలెడదాం..
1971 దశాబ్ధపునాటి మాట. వియత్నాం యుద్ధ రహస్య డాక్యుమెంట్లు (పెంటగాన్ పేపర్స్) లీకేజీతో ఆనాటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ పదవి ఊడింది. ఇప్పుడు సెక్స్ మానియా ఎప్స్టీన్ పేపర్స్ లీకేజీతో ప్రపంచవ్యాప్తంగా ప్రిన్స్ ఆండ్రూ, బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్, ఎలన్ మస్క్, పీటర్ మాండెల్సన్, స్టీవ్ టిష్ వంటివారితో సహా 200 మంది వరకు చిగురుటాకుల్లా వణుకుతున్నారు. ఈ రెండు లీకేజీలు జర్నలిజం చలువే. పవర్ఫుల్ వ్యక్తుల అల్పబుద్ధులు కవర్ చేయడమనేది మీడియా ధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. జర్నలిజం పునాది సత్యాన్వేషణ. నిక్సన్ కుర్చీ కదిలినా, సెక్స్ ట్రాఫికర్ ఎప్స్టీన్ కుక్కచావు చచ్చినా, బ్రిటన్ రాజకిరీటం కింద పడినా..అది జర్నలిజం ప్రతిభే!
పెద్దమనుషుల ముసుగులో నీచ నికృష్ట పనులు చేసే వారి అసలు స్వరూపాన్ని ఎప్స్టీన్ మెయిల్స్ లీకేజీ అయ్యేలా జూలీ కే. బ్రౌన్ ఒంటి చేత్తో పోరాడారు. ఇప్పుడామె పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగుతోంది.

ఇంతకీ ఎవరీ జూలీ కే.బ్రౌన్..?
ఆమె ఓ సాదాసీదా జర్నలిస్టు. ఓ ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్. అమెరికా పెన్సిల్వేనియా రాష్ట్రం ఫిలడెల్ఫియా నగరం. 1969 చివరలోనో.. 1970 మొదట్లోనో పుట్టారట. శ్వేత జాతీయురాలు. మధ్యతరగతి కుటుంబం. తల్లి తప్ప తండ్రి జాడ తెలియదు. ముగ్గురు పిల్లల్లో ఈమె ఒకరు. తల్లి రెండు ఉద్యోగాలు చేసి పిల్లల్ని పెంచింది. ఆ ఉద్యోగాల్లో ఒకటి వెయిట్రెస్ పని. తల్లి తక్కువ సమయం ఇంట్లో ఉండేది. తోటి పిల్లలు చిన్నచూపు చూసేవారు. ఒంటరితనం సరేసరి.
ఈలోపు16 ఏళ్లు వచ్చాయి. ఇంటి నుంచి బయటపడింది. స్నేహితులతో ఉండేది. పొట్టగడవడానికి చిన్నా చితక పనులు చేసేది. లాంప్షేడ్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నప్పుడు అక్కడి ఘటనలు కొన్ని కలచివేసేవి. కోపం కట్టలు తెంచుకున్నా ఏమీ చేయలేకపోయానే.. అని కుమిలిపోయేది.
ఆమె చదువు ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్శిటీలో జర్నలిజం విభాగంలో సాగింది. 1987లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసింది. టాప్ ర్యాంకు. కాలేజీలోనే వెయిట్రెస్ పని చేసి ఖర్చులకు సంపాయించుకునేది. స్కాలర్షిప్ – ట్యూషన్ ఫీజుకు సరిపోయేది. స్కూల్ రోజుల్లోనే స్కూల్ న్యూస్పేపర్ ఎడిట్ చేసింది. ప్రైజ్లు గెలిచిన కథలు రాసింది. ఇది ఆమెలో రచనా ఆసక్తి పెంచింది.
ఆమె కుటుంబం గురించి వివరాలు తక్కువే. తండ్రి గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. ఆమెకు ఓ కొడుకు, కూతురు. ఆమె వివాహం విడాకులతో ముగిసింది. ప్రస్తుతం ఆమె ఒంటరి. చిన్ననాటి అనుభవాలు బాధితుల పట్ల సానుభూతి పెంచాయి. “తనకూ అలాంటి పరిస్థితి వస్తే” అనే ప్రశ్న ఆమెను జర్నలిజం వైపు నడిపాయి. ‘ప్రపంచాన్ని మార్చాలని’ కోరుకుంది. వినేవాళ్లకు వెటకారంగా అనిపించినా అది నిజమని ఆమె అనేక సందర్భాల్లో చెప్పారు.
టెంపుల్ యూనివర్శిటీలో జర్నలిజం తర్వాత ఫిలడెల్ఫియా డైలీ న్యూస్కు తొలుత పని చేశారు. ఆ తర్వాత వివిధ పత్రికలకు మారారు. ముప్పయి ఏళ్లకు పైగా అనుభవం. క్రైమ్, న్యాయవ్యవస్థ, మానవ హక్కులు వంటి అంశాలపై దృష్టి పెట్టింది. మయామి హెరాల్డ్లో ఇన్విస్టిగేటివ్ రిపోర్టర్గా చేరింది. ఇప్పటికీ అక్కడే పనిచేస్తోంది.

మయామి హెరాల్డ్లో ఆమె జీతం సుమారు 55 వేల నుంచి 70 వేల డాలర్లు. ఎప్స్టీన్ కేసు తర్వాత ఆమె రాసిన ‘పర్వర్షన్ ఆఫ్ జస్టిస్’’ అనే పుస్తకం బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. పబ్లిషర్ నుంచి సుమారు 1 మిలియన్ డాలర్లు అడ్వాన్స్ వచ్చింది. తన పరిశోధనకు సాయపడిన ప్రైవేట్ డిటెక్టివ్ కు ఇచ్చింది పోగా ఆమెకు సుమారు 6.5 లక్షల డాలర్లు వచ్చాయి.
ఎప్స్టీన్ మెయిల్స్ లీక్ తర్వాత కూడా ఆమె తెరచాటు మనిషిగానే మిగిలారు. ఎక్కడా ప్రసంగాలు చేసినట్టు ఆధారాలు లేవు. కానీ ఆమె ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఎన్పీఆర్, సీఎన్ఎన్, ఎమ్ఎస్ఎన్బీసీ వంటి మాధ్యమాల్లో మాట్లాడింది. పాడ్కాస్టుల్లో పాల్గొంది. నైట్ మీడియా ఫోరమ్ 2026లో మార్టీ బారన్తో చర్చలో పాల్గొంది. ఆమె పని ఇప్పటికీ అన్వేషణ మీదే.
యువ జర్నలిస్టులకు ఆమె ఇచ్చే సలహాల్లో ముఖ్యమైంది పట్టుదల. ఎప్స్టీన్ కేసును చేధించడానికి ఆమెకు కొన్నేళ్లు పట్టింది. అయినా ఆమె పని చేసే పత్రిక యాజమాన్యం అంగీకరించింది. మనకు ఏదైనా వార్త తెలిసినప్పుడు కంగారు పడవద్దు అని చెబుతారు. పెద్ద కుంభకోణం గురించి భయపడవద్దు అంటుంది. చిన్న స్టోరీల నుంచి అనుభవం సంపాదించండి అంటుంది. డెడ్ ఎండ్స్ వచ్చినా వదలవద్దు అంటుంది. బాధితుల పట్ల సానుభూతి ముఖ్యం అంటుంది. స్థానిక జర్నలిజం శక్తిని గుర్తించండి అంటుంది.
ఎప్ స్టీన్ ముఠా చేతిలో దెబ్బతిన్న 80 మంది బాధితుల కథల్ని ఆమె రికార్డు చేశారు. వీళ్ల గాథలతో ఆమె రాసిన పుస్తకం అనేక అవార్డులు, రివార్డులు తెచ్చిపెట్టింది. ఫ్లోరిడా రాష్ట్రంలోని మహిళా జైలులో పౌర హక్కులు ఎలా దుర్వినియోగం అయ్యాయో సోదాహరణంగా వివరిస్తూ 2018 నుంచి వార్తలు రాస్తోంది. ఆమె రాసిన కథనాల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఫెడరల్ దర్యాప్తు ప్రారంభించింది. మెడికల్ మాల్ప్రాక్టీస్, హెల్త్కేర్ మోసాలు మీద కూడా రిపోర్ట్ చేసింది. పులిట్జర్ ప్రైజ్ గెలిచిన టీమ్లో ఆమె ఉంది.
జూలీ కె. బ్రౌన్ ఒక మామూలు మహిళ, కానీ ఆమె విజయం అసాధారణం. పవర్ ఫుల్ వ్యక్తుల గబ్బును కడిగిపారేసింది. అందుకు తోడ్పడిన తన ఎడిటర్ కు ధన్యవాదాలు చెప్పింది. జర్నలిజం విలువల్ని వెలుగెత్తి చాటిందే గానీ ‘కోవా బన్’ అమ్ముకునే చిరు వ్యాపారుల కడుపు కొట్టలేదు. సంచలనానికి పాకులాడలేదు. తెలుగు జర్నలిస్టులు, ముఖ్యంగా సోషల్ మీడియా ‘రిపోర్టర్లు’ జూలీ నుంచి నేర్చుకోవాల్సింది ఇదే. అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ధైర్యం, బాధితుల పట్ల సానుభూతి ఉండటమే నిజమైన జర్నలిజం.

✍️ ఆకుల అమరయ్య
(ది ఫెడరల్ సౌజన్యంతో..)

