వరంగల్ లో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు భద్రాచలం నియోజకవర్గం నుంచి గులాబీ శ్రేణులంతా దండుకట్టాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. పార్టీ పాతికేళ్ల సభ కనీవినీ ఎరుగని రీతిలో జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. భద్రాచలం నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ ఇంచార్జ్ మానె రామకృష్ణ అద్యక్షతన స్థానిక రెడ్డి సత్రంలో శుక్రవారం జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ రవిచంద్ర వరంగల్ సభ విజయవంతానికి పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఏప్రిల్ 27 గులాబీ పార్టీ పండుగ రోజని, ఆ రోజు గ్రామ గ్రామాన గులాబీ జెండాలు రెపరెపలాడాలని అన్నారు.
‘మీరంతా కష్టపడి గెలిపిస్తే, ఇక్కడి ఎమ్మెల్యే మీకు, పార్టీకి ద్రోహం చేసి వెళ్లిపోయారు. అయినా బాధ లేదు. రేపో మాపో మళ్లీ ఉప ఎన్నికలు రాబోతున్నాయి. ఈ ఎన్నికల్లో కచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్లీ గెలవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని అంశాల్లో విఫలమవుతోంది. హామీల అమలు దగ్గర నుంచి, పాలనా పరమైన నిర్ణయాల వరకు అభాసుపాలవుతోంది’ అని వద్దిరాజు విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరిస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. పినపాక మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు మాట్లాడుతూ వరంగల్ సభ దిగ్విజయానికి అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు.

సత్తుపల్లిలో..
బీఆర్ఎస్ రజతోత్సవ సభ జయప్రదం చేయడంలో సత్తుపల్లి నియోజకవర్గ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కోరారు. శుక్రవారం కల్లూరు మండలంలోని డీ ఎన్ పీ ఫంక్షన్ హాలులో మండల బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి ఎంపీ రవిచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతుందన్నారు. పది లక్షల మందితో జరిగే సభకు గ్రామ గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు బయలుదేరి రావాలని పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ రాష్ట్రంలో గులాబీ పండగ వలె జరుపుకుంటున్నామని, ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. కల్లూరు మండలం నుంచి పెద్ద ఎత్తున కదలిరావాలని వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.

కొత్తగూడెంలో..
ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగే గులాబీ పార్టీ రజతోత్సవ పండుగకు కొత్తగూడెం గడ్డ నుంచి తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో కదం తొక్కాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తో కలిసి వరంగల్ సభ వాల్ పోస్టర్లను రవిచంద్ర శుక్రవారం ఆవిష్కరించారు. వరంగల్ సభకు బయలుదేరే ముందు ఆయా వార్డులు, గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ జెండాలను ఆవిష్కరించుకుని బస్సుల్లో బయలుదేరాలని సూచించారు. సభ విజయవంతం చేయడంలో మిగతా అన్ని నియోజకవర్గాలకన్నా కొత్తగూడెం ముందుండాలని కోరారు.

ఉద్యమకారుడికి ఫ్లూట్ బహూకరించిన వద్దిరాజు:
భద్రాచలానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, ఫ్లూట్ వాయిద్య కళాకారుడు తూతిక ప్రకాష్ కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ. 30 వేల విలువైన అధునాతన ఫ్లూట్, పరికరాలను బహుకరించారు. నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి వాటిని అందజేశారు. ప్రకాష్ కు కేసీఆర్ అన్నా, బీఆర్ఎస్ పార్టీ అన్నా అభిమానం ఎక్కువ. ఎక్కడ పార్టీ సభలు జరిగినా, ఉప ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి బీఆర్ఎస్ కు అనుకూలంగా ప్రచారం చేస్తుంటాడు.

ఖమ్మంలో 2023 జనవరి 18న జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు సూచన మేరకు ఎంపీ రవిచంద్ర ఆయనకు కొత్త మోటార్ సైకిల్ ను బహుకరించారు. తనకు ఫ్లూట్ వాయిద్యంలో ఉన్న అనుభవం, సరైన పరికరాలు లేక సాధన చేయలేకపోతున్న విషయాన్ని ఎంపీ రవిచంద్ర దృష్టికి తీసుకెళ్లగా, ఆయన తక్షణమే ఫ్లూట్ వాయిద్య పరికరాల కొనుగోలుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆ మేరకు కొనుగోలు చేసిన పరికరాలను శుక్రవారం భద్రాచలంలో అందజేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ ను ఎంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు లు శాలువాతో సత్కరించారు

జ్యోతిరావు ఫూలే కు ఎంపీ రవిచంద్ర నివాళి
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆయనకు నివాళులు అర్పించారు. బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావుతో కలిసి భద్రాచలం లోని రెడ్డి సత్రంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని శ్లాఘించారు. సమాజంలో కుల, లింగ వివక్షతకు తావు లేకుండా అన్ని వర్గాలకు విద్య అందాలని, విద్య ద్వారానే బలహీన వర్గాలు సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయని ఆ రోజుల్లోనే భావించిన గొప్ప నాయకుడు ఫూలే అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే చూపిన మార్గంలో నడుస్తూ, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయా వర్గాల సంక్షేమానికి విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనలో బడుగు, బలహీన వర్గాల వారందరం భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని రవిచంద్ర అన్నారు.

