Top 5 This Week

Related Posts

డిప్యూటీ సీఎం భట్టి ‘క్యాంపు’లో వరుస విషాద ఘటనలు

ఖమ్మం: తెలంగాణా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శిబిరంలో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనలు కాంగ్రెస్ కేడర్ లోనే కాదు, జర్నలిస్టు సర్కిళ్లలోనూ తీవ్ర దుఃఖాన్ని మిగులుస్తున్నాయి. గడచిన 14 నెలల కాలంలో భట్టి క్యాంపునకు చెందిన ముగ్గురు ముఖ్య వ్యక్తులు మృత్యువాత పడడంతో సంబంధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ వరుస పరిణామాలు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కూడా తీరని వేదనను మిగులుస్తున్నాయి.

శ్రీనివాస్

నిరుడు ఫిబ్రవరి 24వ తేదీన భట్టి వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్లపెల్లి శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. ఖమ్మం శివారల్లో గల ఏదులాపురం మున్సిపాలిటీలోని తన నివాసంలోనే శ్రీనివాస్ ఆకస్మికంగా మృతి చెందిన ఘటన భట్టి విక్రమార్క క్యాంపు ఆఫీసులో విషాదాన్ని నింపింది. శ్రీనివాస్ గుండెపోటుతో మరణించడంపై భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఆ తర్వాత ఈనెల 15వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, భట్టి విక్రమార్కకు అత్యంత సన్నిహితుడైన మహ్మద్ జావీద్ ప్రాణాలు కోల్పోయారు. భట్టికి అత్యంత సన్నహితంగా ఉండే నలుగురైదుగురు కాంగ్రెస్ నేతల్లో జావీద్ కీలకమైన నాయకుడు. ఓరకంగా చెప్పాలంటే జావీద్ రోడ్డు ప్రమాదంలో ఆకస్మికంగా మరణించడం వ్యక్తిగతంగా భట్టికే కాదు, కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టంగానే చెప్పవచ్చు. జావీద్ పార్టీకి చేసిన సేవలను రెండు, మూడు రోజుల క్రితం నిర్వహించిన సంతాప సభలో భట్టి విక్రమార్క కొనియాడారు. తనకు, జావీద్ కు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుని బాధపడ్డారు.

మధుసూదన్

ఈ ఘటన నుంచి భట్టి విక్రమార్క శిబిరం కోలుకోకముందే తాజాగా ఆయన వద్ద సీపీఆర్వోగా పనిచేస్తున్న జర్నలిస్ట్ మారబోయిన మధుసూదన్ నిన్న గుండెపోటుకు గురై మరణించారు. భట్టికి, మధుసూదన్ కు మధ్య గల బంధం సీపీఆర్వోగా విధులు నిర్వహించడం మాత్రమే కాదు, జర్నలిస్టు మధుసూదన్ తో డిప్యూటీ సీఎం భట్టికి దశాబ్ధాల అనుబంధం ఉంది. ఆ అనుబంధం నేపథ్యంలోనే మధుసూదన్ భట్టి వద్ద సీపీఆర్వోగా చేరారు. మధుసూదన్ ఆకస్మిక మరణం పట్ల భట్టి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

పీఏ శ్రీనివాస్ విషయంలోనే కాదు, జావీద్, మధుసూదన్ లు మరణించిన సందర్భాల్లోనూ డిప్యూటీ సీఎం భట్టి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇటువంటి కష్ట సమయాల్లో ఆయా కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరముందని కూడా ఆయన స్పష్టం చేశారు. అనూహ్యంగా చోటుచేసుకున్న ఆయా వరుస ఘటనలు అటు కాంగ్రెస్ లో, ఇటు మీడియా సర్కిళ్లలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.

Popular Articles