Top 5 This Week

Related Posts

నేటి నుంచి ‘ఎస్ఐఆర్’: ఇవీ ఖమ్మం జిల్లా కలెక్టర్ సూచనలు

ఖమ్మం: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం గురువారం నుంచి ప్రారంభమవుతోంది. ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమానికి సంబంధించిన ముందస్తు ఏర్పాట్లు విజయవంతంగా పూర్తయ్యాయని కలెక్టర్ తెలిపారు. బూత్ లెవల్ అధికారులకు (బీఎల్‌వోలు) శిక్షణలు నిర్వహించడంతో పాటు అవసరమైన పత్రాలను పంపిణీ చేసినట్లు చెప్పారు.

ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతి ఓటరుకు ఎన్యూమరేషన్ ఫారంలు రెండు అందజేస్తారని తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా ఎన్యూమరేషన్ ఫారం నింపి తిరిగి ఒక ఫారం బీఎల్‌వోలకు అందజేయాలని సూచించారు. ప్రతి ఇంటిని బీఎల్‌వోలు మూడు సార్లు సందర్శిస్తారని తెలిపారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించేందుకు మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఓటర్లు ఇంటి వద్ద అందుబాటులో ఉండి వివరాలను సక్రమంగా అందించాలని విజ్ఞప్తి చేశారు.

బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు ఓటర్లకు ఫారాలు నింపడంలో సహాయపడతారని, ఇంటింటి సర్వే సమయంలో బీఎల్‌ఏలు బీఎల్‌వోలతో కలిసి వెళ్లవచ్చని తెలిపారు. బీఎల్‌వోలకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు అందించగా, బీఎల్‌ఏలు తమ రాజకీయ పార్టీలు జారీ చేసిన గుర్తింపు కార్డులను కలిగి ఉండాలని సూచించారు.

విదేశాల్లో, ఇతర నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు, సైన్యంలో విధులు నిర్వహిస్తున్న ఓటర్లు ఆన్‌లైన్ ద్వారా ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించవచ్చని, లేదా వారి కుటుంబ సభ్యులు సంబంధిత బీఎల్‌వోకు వివరాలు అందించవచ్చని తెలిపారు.

జూలై 31న ముసాయిదా ఎస్‌ఐఆర్ ఓటరు జాబితా విడుదల చేస్తామని, ఓటరు పేరు లేకపోవడం లేదా ఇతర అభ్యంతరాలపై ఆగస్టు 30, 2026 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అందిన అన్ని అభ్యంతరాలను సెప్టెంబర్ 28, 2026 నాటికి పరిష్కరించి అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు.

ఎన్యూమరేషన్ ఫారాలు ఎలా నింపాలో వివరించే ట్యుటోరియల్ వీడియోలను సిద్ధం చేశామని, ఫారాలతో పాటు వివరణాత్మక కరపత్రాలను కూడా అందజేస్తామని తెలిపారు.

మ్యాపింగ్ పూర్తయిన ఓటర్లు కూడా తప్పని సరిగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించాలని స్పష్టం చేశారు. మ్యాపింగ్ అనేది కేవలం ప్రీ-ఎస్‌ఐఆర్ ప్రక్రియ మాత్రమేనని, ఎన్యూమరేషన్ ఫారం పూర్తి చేయడానికే అది ఉపయోగమని, అది ఫారానికి ప్రత్యామ్నాయం కాదని అన్నారు.

2002 ఎస్‌ఐఆర్ జాబితాలో దేశంలోని ఎక్కడైనా ఓటు నమోదై ఉన్నట్లయితే ఆ వివరాలను ప్రస్తుతం ఇవ్వవచ్చని తెలిపారు. ముఖ్యంగా వివాహానంతరం ఇతర ప్రాంతాలకు వెళ్లిన మహిళలకు ఈ అవకాశం ఉపయోగపడుతుందని అన్నారు. 2002 ఎస్‌ఐఆర్ ఓటు ఆధారంగా ఆరుగురు కుటుంబ సభ్యులను అనుసంధానం చేయవచ్చని వివరించారు.

డూప్లికేట్ ఓటర్లను గుర్తించే ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ఒకే పేరు, ఇంటి పేరు, తండ్రి పేరు వంటి వివరాలతో ఉన్న డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను గుర్తించి, బీఎల్‌వోలు క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించిన అనంతరం తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై రాజకీయ పార్టీలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తూ తాజా సమాచారం అందిస్తున్నామని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి సందేహానికి సమాధానం ఇవ్వబడుతుందని తెలిపారు.

స్వాతంత్య్రానంతరం దేశంలో ఇది ఎనిమిదవ ఎస్ఐఆర్ కార్యక్రమమని, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారి పేర్లను తొలగించి ఓటరు జాబితాను క్లియర్ గా ఉంచేందుకు ఎస్‌ఐఆర్ ఉపయోగపడుతుందని వివరించారు.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి వివక్ష ఉండదని, అర్హులైన ఒక్క ఓటరు కూడా జాబితా నుంచి తప్పిపోకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారం సమర్పించని వారి పేర్లు ముసాయిదా ఓటరు జాబితాలో ఉండవని స్పష్టంచేశారు. ఫారం సమర్పించిన ఓటరు పేరును నిబంధనల ప్రకారం తొలగించబోమని వెల్లడించారు.

Popular Articles