‘ఆపరేషన్ సిందూర్’ ఫలితాలు ఒక్కొక్కటిగా బాహ్య ప్రపంచానికి తెలుస్తున్నాయి. గత రాత్రి 1.44 గంటలకు ఇండియన్ ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ పరిణామాల్లో 80 మంది టెర్రరిస్టులు హతమైనట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. హతమైన టెర్రరిస్టులు జైషే మహ్మద్, లష్కరే తోయిబా సంస్థలకు చెందినవారుగా సమాచారం. బవహల్పూర్, మురిద్కే క్యాంపుల్లోనే ఆయా సంఖ్యలో టెర్రరిస్టులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టినట్లు ఆయా వార్తల సారాంశం.
ఒక్కో క్యాంపులో కనీసంగా 25 నుంచి 30 మంది వరకు టెర్రరిస్టులు హతమైనట్లు సమాచారం. బవహల్పూర్ లోని ఉస్మాన్ ఆలీ క్యాంప్ జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు కీలకంగా గుర్తించారు. దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో విస్తరించిన ఈ క్యాంపును 2019లో ఇండియా టార్గెట్ గా చేసుకున్నప్పటికీ, ఆఖర్లో వదిలేసింది. ఈసారి నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’లో దీన్ని నేలమట్టం చేసింది.

మొత్తంగా ఇప్పటి వరకు ధ్వంసం చేసిన తొమ్మిది టెర్రరిస్టు స్థావరాల్లో 80 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. మరోవైుప ఇండియన్ ఇంటలిజెన్స్ వర్గాలు పాకిస్థాన్ కు జరిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో నిమగ్నమైంది.

