ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు పర్యటించారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల కలెక్టర్లు అనుదీప్ దురిశెట్టి, అంకిత్ లతో కలిసి మంత్రి తుమ్మల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా పర్యటించారు. సత్తుపల్లి మండలంలో సీతారామ ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న యాతలకుంట టన్నెల్ నిర్మాణ పనులను ఆయన ఈ సందర్భంగా పరిశీలించారు.
అదేవిధంగా ఖమ్మం నగరంలోని చర్చికాంపౌండ్, ప్రకాష్ నగర్ ఓవర్ బ్రిడ్జిని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యలతో కలిసి మంత్రి పరిశీలించారు. బ్రిడ్జిల ప్రస్తుత పరిస్థితి, మరమ్మత్తుల అవసరం, ట్రాఫిక్ సౌకర్యాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. పౌర సరఫరాలు, మార్కెటింగ్, మార్క్ఫెడ్, పంటల కొనుగోలు, మున్నేరు రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రగతి, ఖమ్మం నగర కార్పొరేషన్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపైనా మంత్రి తుమ్మల కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
ఖమ్మం నగరంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద కోటి 46 లక్షల రూపాయల వ్యయంతో ఆర్టీఓ ఆఫీస్ నుంచి బైపాస్ రోడ్డు వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు, విజయనగర కాలనీలో 50.85 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు మంత్రి తుమ్మల శంకుస్థాపన చేశారు.

