కూసుమంచి: పాలేరు నియోజకవర్గంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు చోట్ల మంత్రి శంకుస్థాపనలు చేశారు.
కూసుమంచి మండలం మల్లాయిగూడెంలో రూ. 2.52 కోట్లతో పెరికసింగారం ఎన్ఎస్పీ కెనాల్ నుంచి భగవాన్ తండా మీదుగా మల్లాయిగూడెం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు, రూ. 20 లక్షలతో నిర్మించే గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి భూమిపూజ చేశారు. అనంతరం కోక్యా తండాలో రూ. 1.69 కోట్లతో లింగారం తండా నుంచి లోక్యా తండా ఎన్ఎస్పీ కాలువ వరకు నిర్మించే బీటీ రోడ్డు పనులకు, అగ్రహారంలో రూ. 20 లక్షలతో నిర్మించనున్న పంచాయతీ భవనానికి శంకుస్థాపనలు చేశారు.
ఆ తర్వాత కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు మంత్రి చేతుల మీదుగా సంక్షేమ చెక్కుల పంపిణీ జరిగింది. మండల వ్యాప్తంగా 66 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా వివిధ అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 111 మంది బాధితులకు రూ. 35.16 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షపాతి అని, ఇప్పటికే ‘రైతు భరోసా’ అందించి అన్నదాతలకు అండగా నిలిచామని స్పష్టం చేశారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా శాస్త్రవేత్తల సూచనలను పాటిస్తూ సాగు విధానాల్లో మార్పులు చేసుకోవడం అత్యంత ఆవశ్యకమని పొంగులేటి అన్నారు. మంత్రి వెంట కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు.

