వరంగల్: రైతు నుంచి లంచం తీసుకున్న కేసులో ఓ ఎమ్మార్వో (తహశీల్దార్)కు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ ఏసీబీ వరంగల్ కోర్టు న్యాయమూర్తి కె. దేశ్ పాండే తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఏసీబీ ఖమ్మం డీఎస్పీ వై. రమేష్ ఓ ప్రకటనలో వివరించారు.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి తహశీల్దార్ గా 2011లో పని చేస్తున్న గుండ్ల నరసింహారావు ఓ రైతు నుంచి లంచం మొత్తాన్ని కోరాడు. వ్యవసాయ భూమికి ఎన్వోసీ జారీ చేయడానికి ఆయా రైతు నుంచి తహశీల్దార్ నరసింహారావు రూ. 3,000 మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అప్పటి ఏసీబీ సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తహశీల్దార్ నరసింహారావును అరెస్ట్ చేశారు.
ఈ కేసులో విచారణ, వాద ప్రతివాదనల అనంతరం తహశీల్దార్ నరసింహారావు అవినీతికి పాల్పడినట్లు ఏసీబీ వరంగల్ కోర్టు నిర్ధారించింది. దీంతో తహశీల్దార్ నరసింహారావుకు రెండేళ్ల జైలు శిక్షతోపాటు రూ. 10,000 జరిమానా విధిస్తూ జడ్జి దేశ్ పాండే తీర్పును వెలువరించారు. కేసు ప్రాసిక్యూషన్ లో ప్రస్తుత ఖమ్మం ఏసీబీ డీఎస్పీ వై. రమేష్, సీఐ శేఖర్, పీపీ జ్యోతిరెడ్డి, కోర్టు కానిస్టేబుల్ నరసింహారావు తదితరులు సహకరించారు.

