హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ను సిట్ విచారించడంపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పదవులు, వేల కోట్ల రూపాయలను సంపాదించుకున్నవారు ఉద్యమాకరులు ఎలా అవుతారని సీఎం ప్రశ్నించారు. పోలీసులు తలుపులు బద్ధలు కొట్టి తీసుకురాలేదని, నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారని కేసీఆర్ ను ఉద్ధేశించి అన్నారు. జార్ఖండ్ రాష్ట్రంకోసం ఉద్యమించిన శిబూ సోరెన్ లాంటివారు కూడా విచారణను ఎదుర్కున్నారని, మనమేమీ దైవాంశ సంభూతులం కాదన్నారు.
అమరవీరుల స్మారక ట్రస్టు ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో రావి నారాయణరెడ్డి పురస్కారాన్ని జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసు, సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించిన అంశంపై స్పందించారు. సీఎం రేవంత్ తన ప్రసగంలో చేసిన వ్యాఖ్యల ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
- తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారు.
- ఉద్యమకారులం అని వాళ్లే చెప్పుకుంటున్నారు.
- పోలీసులు చిన్న నోటీసులు ఇస్తే జాతిపితకు నోటీసులు ఇస్తారా..? అని అంటున్నారు.
- ఆనాడు జాతిపిత గాంధీజీ పదవులను త్యాగం చేసి దుర్మార్గుల తూటాలకు ప్రాణాలు వదిలారు.
- మరి ఇప్పుడు జాతిపిత అని చెప్పుకుంటున్న వాళ్లు ఏం చేశారు?
- తెలంగాణ ఉద్యమకారులను ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా?
- ఆనాడు తలుపులు బద్దలు కొట్టి ఆయన్ను అరెస్టు చేసింది మీ పాలనలో కాదా..? అప్పుడు ఉద్యమకారులు గుర్తుకురాలేదా?
- పోలీసులు మిమ్మల్ని అలా తలుపులు బద్దలు కొట్టి తీసుకురాలేదు కదా…? నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచారు.
- రావి నారాయణరెడ్డి లాంటి వారు తెలంగాణ కోసం సర్వం కోల్పోయారు.
- పదవులు, వేలకోట్ల ఆస్తులు సంపాదించుకున్న మీరు ఉద్యమకారులు ఎలా అవుతారు?
- ప్రజలు మిమ్మల్ని తిరస్కరించినప్పుడు అర్థం చేసుకోవాలి.
- ప్రజలే తప్పు చేశారని చెప్పడం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం? ఇదెక్కడి ఉద్యమకారుడి లక్షణం? ఇదెక్కడి జాతిపిత లక్షణం?
- అక్రమ మార్గం ఎంచుకున్నవారు ప్రజాస్వామ్యంలో విచారణ ఎదుర్కోవాల్సిందే అని అంబేద్కర్ చెప్పారు.
- శిబు సోరెన్ లాంటి వాళ్లు విచారణ ఎదుర్కొన్నారు.
- మనమేం దైవాంశ సంభూతులం కాదు.
- మధ్య యుగాల చక్రవర్తులు తమ బాధను రాజ్యం బాధగా ప్రచారం చేసేవారు.
- మధ్య యుగాల చక్రవర్తులకు కాలం చెల్లింది.
- ప్రజాస్వామ్యంలో తప్పు చేసినవారు విచారణ ఎదుర్కోవాల్సిందే.

