హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU)లో పోలీసు బలగాల మోహరింపుపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. HCUలో పోలీసు బలగాలను ఉపసంహరిస్తున్నామని, సంరక్షణకు తగిన చర్యలు చేపట్టాలంటూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బీజే రావుకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం ఓ లేఖ రాశారు.
కంచె గచ్చిబౌలి సమస్యపై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సబ్ కమిటీ సమావేశంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులు ప్రొఫెసర్ సౌమ్య దేచమ్మ CC, ప్రొఫెసర్ శ్రీపర్ణ దాస్, ప్రొఫెసర్ భంగ్య భూక్య, పౌర సంఘాల ప్రతినిధులు విస్సా కిరణ్కుమార్, NAPM, V.సంధ్య, WTJAC – K.సజయ, WTJAC, ఇమ్రాన్ సిద్ధిఖీ, CWS-ఇండియా తదితరులు పాల్గొని యూనివర్సిటీలో మోహరించిన పోలీసు బలగాలను ఉపసంహరించుకోవాలని మంత్రుల బృందానికి వినతిపత్రం సమర్పించారు. ఈ విజ్ఞప్తిపై మంత్రుల సబ్ కమిటీ సానుకూలంగా స్పందించింది. సబ్ కమిటీ ఛైర్మెన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అధ్యాపకులు, రిజిస్టార్ గతంలో చేసిన విజ్ఞప్తిని క్రోడీకరిస్తూ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు లేఖ రాశారు.

డిప్యూటీ సీఎం రాసిన లేఖ వివరాలు:
‘‘హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తి, బోధన, పరిశోధనలకు సురక్షితంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వానికి అచంచల విశ్వాసం ఉందని పునరుద్గాటిస్తున్నాం. ఈనెల 2వ తేదీన యూనివర్సిటీలో శాంతి భద్రతలు, విద్యార్థులు అధ్యాపకుల భద్రతకు క్యాంపస్ లో పోలీసులను అందుబాటులో ఉంచాల్సిందిగా మీ రిజిస్ట్రార్ కోరారు. ఆ మేరకు గతంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశాము. ఉపాధ్యాయ జేఏసీ, పౌర సంఘం సభ్యుల విజ్ఞప్తికి స్పందించి కంచ గచ్చిబౌలి లోని 400 ఎకరాలను మినహాయించి మెయిన్ క్యాంపస్ సమీపంలో పోలీస్ బందోబస్తు ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు ప్రభుత్వం పక్షాన మీకు తెలియజేస్తున్నాం. గౌరవ సుప్రీంకోర్టు ఆదేశానికి అనుగుణంగా 400 ఎకరాలు ఉన్న కంచ గచ్చిబౌలిలో చెట్ల సంరక్షణ తప్ప ఏ ఇతర కార్యకలాపాలకు అనుమతించకూడదు. క్యాంపస్ లో కార్యకలాపాలు శాంతియుతంగా జరిగేలా మీ సొంత సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మీ నుంచి లిఖిత పూర్వకంగంగా హామీ వచ్చిన తర్వాత పోలీసులను ఉపసంహరిస్తాం. ప్రభుత్వ౦ HCUకి సంబంధించిన అంశంలో అందరితోనూ చర్చలకు ఎల్లవేళలా సిద్ధంగా ఉందని మా పక్షాన మీరు హామీ ఇవ్వండి. విద్య, నైపుణ్యం సామాజిక బాధ్యత సాధించడంలో యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలిచి పని చేయడానికి సదా సిద్ధంగా ఉంది.’’
ఇట్లు
భట్టి విక్రమార్క మల్లు
డిప్యూటీ సీఎం, తెలంగాణ

