ఖమ్మం: ఖమ్మం-దేవరపల్లి మార్గంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం కానుంది. దాదాపుగా పూర్తయిన ఈ హైవేలో ఇప్పటి వరకు వైరా నుంచి మాత్రమే వాహనాలను అధికారికంగా అనుమతిస్తుండగా, తాజాగా తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద నుంచి కూడా నేషనల్ హైవే అథారిటీ అధికారులు వాహనాలను అనుమతించడం విశేషం. దీంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి వైపు వెళ్లే భారీ వాహనాల తాకిడి, ట్రాఫిక్ రద్దీ ఖమ్మం నగరంలో తగ్గనుంది.
ఖమ్మం-దేవరపల్లి మార్గంలోని ధంసలాపురం వద్ద ఆర్వోబీ పనులు రెండో వైపున కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగాక దేశ ప్రధాని చేతుల మీదుగా ఈ హవే జాతికి అంకితం కానున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులు స్పష్టం చేస్తున్నారు.
కాగా ఈ మార్గంలో తల్లంపాడు నుంచి వాహనాలను నిన్నటి నుంచే అనుమతిస్తున్నట్లు NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. దివ్య ప్రకటించారు. రాజమండ్రి వైపు వెళ్లే భారీ వాహనాలు ఖమ్మం నగరం నడిబొడ్డు నుంచి ప్రాయణిస్తున్న కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీంతో ట్రాఫిక్ ను తల్లంపాడు ఎంట్రీ పాయింట్ వద్ద నుంచి ప్రయాణించేందుకు అనుమతించినట్లు ఆమె పేర్కొన్నారు. హైవే ప్రారంభానికి అధికారిక ప్రారంభం ఏమీ ఉండదని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటువంటి ప్రాజెక్టులు జాతికి అంకితమవుతుంటాయని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

