హైదరాబాద్: బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు తెలంగాణా మంత్రి ధనసరి అనసూయ అలియాస్ సీతక్క లీగల్ నోటీస్ జారీ చేశారు. బీఆర్ఎస్ పార్టీ తరపున సోషల్ మీడియాలో తనపై నిరాధార ఆరోపణల ద్వారా దుష్ప్రచారం చేశారని, అందుకు కేసీఆర్ దే బాధ్యతగా పేర్కొంటూ సీతక్క తన లాయర్ నాగులూరి కృష్ణకుమార్ ద్వారా ఈ లీగల్ నోటీసును జారీ చేశారు.
అంగన్ వాడీ కేంద్రాలకు మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంలో కుంభకోణం జరిగిందని, అవినీతి చోటు చేసుకుందని బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు మన్నె క్రిశాంక్ ఇటీవల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాల్లోనే తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పు తెగుద్ది.. అంటూ సీతక్క ఫైర్ అయ్యారు.
ఈ అంశంలో తన ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, తనకు సంబంధంలేని ఈ అంశంలో జరుగుతున్న దుష్ప్రచారానికి కేసీఆర్ దే బాధ్యత అని సీతక్క పేర్కొన్నారు. నలభై ఎనిమిది గంటల్లో సోషల్ మీడియా పోస్టులు తొలగించాలని, తనకు క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి సీతక్క తన లీగల్ నోటీసులో పేర్కొన్నారు.
కేసీఆర్ కు మంత్రి సీతక్క జారీ చేసిన లీగల్ నోటీస్ ప్రతిని దిగువన చూడవచ్చు..







