గుండాల: భద్రాద్రి జిల్లా ఆళ్లపల్లి మండలంలో పులి సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. రేగళ్ల అటవీ రేంజ్ నుంచి ఆళ్లపల్లి రేంజ్ లోకి పెద్దపులి ప్రవేశించిన అడుగుజాడలను అధికారులు కనుగొన్నారు. దీంతో స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా రైతులు, కూలీలెవరూ వ్యవసాయ పనులకోసం పంట చేలల్లోకి వెళ్లవద్దన్నారు.

అదేవిధంగా పశువుల కాపరులు కూడా అటవీ ప్రాంతం వైపు వెళ్లరాదని సూచించారు. గ్రామస్తులు సైతం ఒంటరిగా తిరగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి కోసం గాలింపు చర్యలను అటవీ అధికారులు ముమ్మరం చేశారు. నాలుగైదు రోజుల క్రితం పినపాక, ఏడూళ్ల బయ్యారం, కరకగూడెం తదితర ప్రాంతాల్లో సంచరించినట్లు వార్తలు వచ్చిన పెద్దపులి తాజాగా ఆళ్లపల్లి అటవీ రేంజ్ లో సంచరిస్తున్నట్లు పాదముద్రల గుర్తింపు ద్వారా అధికారులు కనుగొన్నారు.

