హైదరాబాద్: ఊహించినట్టుగానే వెండి ధరలకు కళ్లెం పడింది. ధరల పతనం భారీ స్థాయిలో ఉండటంతో స్పల్పకాలిక పెట్టుబడిదారులు తీవ్రంగా నష్టపోయారు. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయానికి కిలో వెండి ధర 2.92 లక్షలకు పతనమైంది. ఒక దశలో కిలో రూ.3.86 లక్షలకు ఎగిసిపడటంతో ఇంకా పెరగొచ్చనే ఆశతో కమాడిటీస్ మార్కెట్ పై అవగాహనలేని అసంఘటిత మదుపరులు భారీగా కొనుగోళ్లు జరిపారు. గరిష్ఠ స్థాయికి చేరగానే సర్దుబాటు(కరెక్షన్ ) మొదలవుతుంది.
అనుకున్నట్టుగానే రూ. లక్షకుపైగా జారిపోయింది. ఇంకో రూ. 50 వేల వరకు తగ్గొచ్చని ప్రస్తుత అంచనాలు చెబ్తున్నాయి. వెండిని అభరణాల కోసం కాకుండా పారిశ్రామిక అవసరాల కోసం మాత్రమే కొనుగోలు చేస్తారు. ఎలక్ట్రానిక్స్ లో వెండి వినియోగం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో వెండికి కొరత వస్తే అభివృద్ధికి ఆటంకంగా మారుతుందని భారత్ సహా పలు దేశాలు నిల్వలు పెంచుకోవడానికి పోటీపడ్డాయి. దానితో వేల టన్నుల లావాదేవీలు జరిగాయి.
రెండు రోజులుగా అంతర్జాతీయంగా డాలర్ రేటు బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ గా Kevin Warsh నియమితులు కావడం వెండి, బంగారం ధరలు తగ్గడానికి కారణాలుగా చెప్పొచ్చు. అమెరికా ఆర్థిక రంగానికి వార్ష్ కాయకల్ప చికిత్స చేస్తారని, దానివల్ల డాలర్ విలువ పెరగవచ్చని మార్కెట్లు నమ్మాయి.
బంగారం కొనుగోలు చేస్తే అభరణాల కింద మార్చుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో బంగారాన్ని అమ్ముకోవడం దివాలా తీసినట్టుగా భావిస్తారు. అదే వెండి విషయంలో అభరణాలకు పెద్దగా డిమాండు ఉండదు. ఇండస్ట్రియల్ అవసరాల కోసమే గ్లోబల్ కంపెనీలు, దేశాలు కొనుగోళ్లు జరుపుతాయి. వాటి టార్గెట్ చేరగానే సేకరణ నిలిచి పోతుంది. అప్పుడు భారీ పతనం చోటుచేసుకోవడం చూస్తున్నాం.

✍️ బి.టి. గోవిందరెడ్డి

