మేడారం: మేడారం జాతరలో సారలమ్మ బుధవారం గద్దెనెక్కడంతో తొలిఘట్టం పూర్తయింది. కన్నెపల్లి నుంచి జంపన్నవాగు మీదుగా కుంకుమ భరిణె రూపంలో సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. అయితే సారలమ్మను గద్దెపైకి తీసుకురావడంలో ఈసారి తీవ్ర జాప్యం జరిగింది. సారలమ్మను తీసుకువచ్చే పూజారులు అలిగిన కారణంగా ఈ జాప్యం అనివార్యమైంది.
సారలమ్మను గద్దెపై ప్రతిష్టించే సమయంలో తాము తప్ప మరెవరినీ అనుమతించవద్దని పట్టుబట్టారు. ముఖ్యంగా గద్దెవద్దకు గిరిజనేతరులను అనుమతించడం సంప్రదాయానికి విరుద్ధమని పేర్కొన్నారు. దీంతో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. అయితే చర్చల అనంతరం అర్ధరాత్రి దాటాక 12.26 గంటల ప్రాంతంలో సారలమ్మ తల్లి గద్దెపైకి చేరుకుంది. రాత్రి 7.38 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకుని పూజారుల బయలుదేరగా, పూజారులు అలిగిన నేపథ్యంలో అర్థరాత్రి దాటాకగాని సారలమ్మ ఆగమనం సాధ్యం కాలేదు.


