(‘సమీక్ష’ అబ్జర్వేషన్ స్టోరీ)
నరేంద్ర చౌదరి N Tv.. పద్ధతిని నెటిజన్లు ఏకిపారేస్తున్నారు. జర్నలిజం పేరుతో వ్యవహరిస్తున్న తీరును సోషల్ మీడియా వేదికగా ‘చాకిరేవు’ పెడుతున్నారు. ఛానల్ లో వల్లెవేస్తున్న నీతి, భక్తి సూత్రాలను ఈ సందర్భంగా వెటకరిస్తున్నారు. మహిళా ఐఏఎస్ అధికారి ప్రతిష్టను బజారున పడేయడమే మీ పరిశోధనాత్మక జర్నలిజమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా పంథా మార్చాలని హితవు చెబుతున్నారు. మహిళా ఐఏఎస్ అధికారిపై ప్రసారం చేసిన ‘ఆఫ్ ది రికార్డ్’ వార్త కథనం, ఆ సంస్థకు చెందిన ఇద్దరు జర్నలిస్టుల అరెస్ట్ నేపథ్యపు పర్యవసానాలపై సోషల్ మీడియా ఖాతాదారులు భిన్నకోణాల్లో స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ ఖాతాల ‘వాల్స్’పై ఈ అంశంలో అనేక స్పందనలు కనిపిస్తున్నాయి. అందులో మచ్చుకు రెండు కథనాలు ఇవీ:
వార్తలంటే ‘వ్యాపారం’ కాదు…
అబద్ధాల ‘వ్యభిచారం’ అంతకంటే కాదు..!
ఒకప్పుడు జర్నలిజం అంటే ఒక బాధ్యత. సమాజానికి అద్దం పట్టే ఆయుధం. కానీ నేడు కొన్ని మీడియా సంస్థల పుణ్యమా అని అది ‘క్యారెక్టర్ అస్సాసినేషన్’ (వ్యక్తిత్వ హననం) చేసే కటిక చీకటి వ్యాపారంగా మారిపోయింది.. ముఖ్యంగా “నిజం నిలకడగా చెబుతాం” అని డబ్బాలు కొట్టుకునే ఛానళ్లు, అబద్ధాన్ని అలంకరించి అడ్డంగా బుక్కవుతున్న తీరు చూస్తుంటే జాలి వేయాలా? లేక అసహ్యించుకోవాలా? అర్థం కావడం లేదు..

బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కబోయి… లాకప్ లోకి..! ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ తన ఫ్యామిలీతో కలిసి బ్యాంకాక్ వెళ్లి చిల్ అవుదామని ప్లాన్ చేసుకున్నారు. పాపం, విమానం ఎక్కేలోపే సీసీఎస్ పోలీసులు ‘ల్యాండింగ్’ ప్లాన్ మార్చేశారు. ఓ మహిళా ఐఏఎస్ అధికారి వ్యక్తిగత జీవితంపై, ఒక మంత్రికి ముడిపెడుతూ నిరాధారమైన వార్తలు వండి వడ్డించినందుకు ఈ ‘సత్కారం’ దక్కింది. రిపోర్టర్లు చారి, సుధీర్లను కూడా లోపల వేసి పోలీసులు తమ స్టైల్లో ఇంటర్వ్యూ చేస్తున్నారు..
జర్నలిజమా? జుగుప్సా?
ఒక మహిళా అధికారి ప్రతిష్టను బజారున పడేయడమేనా మీ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం? ఆధారాలు ఉండవు, అథెంటిసిటీ అసలే ఉండదు… కానీ థంబ్ నెయిల్స్ మాత్రం ‘షాకింగ్’, ‘సంచలనం’ అంటూ హోరెత్తిపోతాయి. యూట్యూబ్లో వ్యూస్ కోసం, రాజకీయ పార్టీల మెప్పు కోసం ఒక ఐఏఎస్ అధికారిణిని టార్గెట్ చేయడం అంటే అది జర్నలిజం కాదు, అక్షర రూపంలో చేసే అరాచకం..
చైర్మన్ ఎక్కడ?
ఇక ఈ వ్యవహారంలో ప్రధాన పాత్రధారులు, ‘నీతి & భక్తి’ సూత్రాలు వల్లే వేసే ఎన్టీవీ సీఈఓ, చైర్మన్ లు ప్రస్తుతం ‘అజ్ఞాత’ యాత్రలో ఉన్నారు. కింద పనిచేసే రిపోర్టర్లు జైలు పాలవుతుంటే, మేనేజ్మెంట్ మాత్రం పోలీసుల కంటపడకుండా తప్పించుకు తిరగడం భలే విచిత్రంగా ఉంది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, వ్యవస్థల మీద గౌరవం లేని వీరు సమాజానికి ఏమని సందేశం ఇస్తారు?
బిఎన్ఎస్ (BNS) సెక్షన్లు 75, 78, 79 వంటివి మీ మీద అలంకారాలు కావు, మీ అదుపు తప్పిన నోటికి, పెన్నుకు వేసిన సంకెళ్లు. జర్నలిస్టులంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభం కావాలి కానీ, ఒకరి జీవితాలను కూల్చే రంపాలు కాకూడదు. ఈ అరెస్టులు కేవలం ఎన్టీవీకో, తెలుగు స్క్రైబ్కో హెచ్చరిక కాదు… మీడియా ముసుగులో మొరిగే ప్రతి ‘అబద్ధాల ఫ్యాక్టరీ’కి ఇదొక గుణపాఠం కావాలి..
ఇకనైనా మార్చండి మీ N Tv పంథా…
లేదంటే చట్టం మార్చేస్తుంది అడ్రస్!
✍️ ఆనంద్ దేవసాని

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే?
నిన్నటి వరకు “టీఆర్పీలలో మేమే తోపులు అంటూ”, “బ్రేకింగ్ న్యూస్ అంటే మాదే” అని కాలర్ ఎగరేసిన ఛానల్… ఇప్పుడు తోక ముడిచి ఒక ‘విచారం’ అనే పదాలు స్క్రీన్ మీద పెట్టింది. ఇవి చూస్తుంటే జాలి కలగడం లేదు కానీ, నేటి మీడియా నైతికత ఎంత దిగజారిందో చూసి నవ్వు వస్తోంది.
స్క్రిప్ట్ రైటర్ల జర్నలిజం!
జనవరి 7న ‘ఆఫ్ ది రికార్డ్’ పేరుతో ఒక కల్పిత కథనాన్ని వండి వడ్డించారు. ఇప్పుడు పోలీసులు అరెస్టులు మొదలుపెట్టగానే, “అది ఎవరినీ ఉద్దేశించినది కాదు” అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఒక అధికారిణి వ్యక్తిత్వాన్ని బజారున పడేసి, ఇప్పుడు అది ‘ఫాంటసీ’ కథ అని బుకాయిస్తారా? వార్త అంటే వాస్తవం ఉండాలి కానీ, మీ ఛానల్ టీఆర్పీ కోసం ఒక మహిళా ఐఏఎస్ అధికారి జీవితంతో “సినిమా స్క్రిప్ట్” రాస్తారా?
మీరు తీసింది ఏమన్నా సినిమానా.. ఇది ఎవరినీ ఉద్దేశించి తీసింది కాదు అని చెప్పడానికి. మీడియా అనే పేరున తోచింది చూపిస్తూ పరువు తీసే హక్కు ఎవడు ఇచ్చాడు? ఏ రాజ్యాంగం ఇచ్చింది?
గౌరవం… అప్పుడు ఏమైంది?
“ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల పట్ల మాకు గౌరవం ఉంది” అని డిస్క్లైమర్లో రాశారు. మరి ఆ గౌరవం జనవరి 8న ఆ పచ్చి అబద్ధాల వార్తను టెలికాస్ట్ చేస్తున్నప్పుడు ఏ గూటిలో దాక్కుంది?. ఐఏఎస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేసి, పోలీసులు బ్యాంకాక్ ఫ్లైట్ ఆపి మరి ఇన్పుట్ ఎడిటర్ని కటకటాల వెనక్కి నెట్టేసరికి, సడన్గా ‘గౌరవం’ అనే పదం గుర్తుకు వచ్చిందా?
అయ్యో పాపం… విచారం!
“మనోభావాలు దెబ్బతిని ఉంటే విచారం వ్యక్తం చేస్తున్నాం”. ఇదొక క్లాసిక్ ఎస్కేప్ రూట్. ఒకరి పరువు తీసి, ఊరంతా ప్రచారం చేశాక, ఒక ‘విచారం’ బోర్డు పెట్టేస్తే సరిపోతుందా? జర్నలిజం అంటే సామాజిక బాధ్యత అనుకున్నాం, కానీ ఇది కేవలం ‘కేసులు పడనంత వరకు మాత్రమే మగాళ్లం’ అనే టైపు జర్నలిజంలా కనిపిస్తోంది.
అధ్యక్షా… ఎన్టీవీ చైర్మన్, సీఈఓ పరారీలో ఉంటే, కింద పని చేసే ఎడిటర్లతో ఇలాంటి ‘విచారకరమైన’ ప్రకటనలు ఇప్పించడం చూస్తుంటే ముచ్చటేస్తోంది. తప్పు చేశామని ఒప్పుకోవడానికి కూడా ధైర్యం లేని ఈ నయా జర్నలిస్టులు, వ్యవస్థలకు నీతులు చెప్పడం ఈ శతాబ్దపు అతి పెద్ద జోక్!
బహుశా ఈ డిస్క్లైమర్ కింద ఇలా రాసుంటే బాగుండేదేమో:
“మాకు దొరికినంత కాలం వార్తలు, ఎవరైనా ధైర్యంగా ముందుకు వచ్చి కంప్లైంట్ ఇచ్చి పోలీసులకు దొరికినప్పుడు మాత్రం ఇది మా విచారం!”
అని. తుపుక్.
✍️ చాకిరేవు

