సుక్మా: ఛత్తీస్ గఢ్ అడవుల్లో గురువారం ఉదయం ఎన్కౌంటర్ ఘటన చోటు చేసుకుంది. సుక్మా జిల్లా గొల్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవుల్లో డీఆర్జీ భద్రతా బగలగాలకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళ సహా ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చవాన్ ప్రకటించారు.
కాగా ఈ ఏడాది ఇప్పటి వరకు ఛత్తీస్ గఢ్ లో జరిగిన వేర్వేరు ఎన్కౌంటర్ ఘటనల్లో 284 మంది నక్సలైట్లు చనిపోయారు. ఇందులో 255 మంది బస్తర్ డివిజన్ లోని సుక్మా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్ ఘటనల్లో మృతి చెందారు. మరోవైపు ప్రభుత్వానికి లొంగిపోతున్న నక్సలైట్ల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతోంది.

