రాష్ట్ర ప్రభుత్వ రుణం తీర్చుకోలేనిదని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అధినేత వత్సవాయి రవి అన్నారు. ఎల్ ఆర్ ఎస్ ( ల్యాండ్ రెగ్యులేషన్ పథకం ) ప్రకటించటం హర్షణీయమన్నారు. ప్రభుత్వ ఋణం ఎలా తీర్చుకోవాలో తెలియడం లేదన్నారు. ఈ విషయంలో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం సహా ఇద్దరు మంత్రులకు కూడా తాము రుణపడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఎల్ ఆర్ ఎస్ ప్రకటించడంపై ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఖమ్మం నగరంలోని శ్రీ బాలాజీ ఎస్టేట్ ఆధ్వర్యంలో గురువారం సభ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి చిత్రపటాలకు వత్సవాయి రవి పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా వత్సవాయి రవి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అకుంఠిత దీక్షతో ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నారని అన్నారు. అంతేకాకుండా 25% సబ్సిడీని ప్రకటించటం కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని కొనియాడారు. ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, ఏజెంట్ మిత్రులకు వరంగా మారిందన్నారు. ఎల్ఆర్ఎస్ పథకం కోసం గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ప్రజలు రియల్, ఎస్టేట్ వ్యాపారులు ఎదురుచూస్తున్నారని రవి గుర్తు చేశారు.

గత ప్రభుత్వం విధానం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక రకాల ఇబ్బందులకు గురయ్యారని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా దాదాపు నాలుగున్నరేళ్లపాటు వ్యాపార కాలం వృధా ప్రయాసగా మారిందని వాపపపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 14 నెలల్లోనే ఎల్ఆర్ఎస్ సమస్యను పరిష్కరించిందని హర్షం వ్యక్తం చేశారు. అంతేగాక 25 శాతం సబ్సిడీ ప్రభుత్వం ప్రకటించటం హర్షించదగ్గ అంశమని, సబ్సిడీ ప్రకటిస్తారని తాము ఊహించలేదని రవి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామన్నారు.
అయితే సబ్సిడీ గడువు మార్చి 31 వరకు ఇవ్వటం తమకే కలిసొచ్చే అంశమైనప్పటికీ, ఇప్పటివరకు పెండింగ్ లో గల ప్లాట్ల క్రయ, విక్రయాలు ఇక ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. దీంతో ప్లాట్లు కొన్నవారికి రిజిస్ట్రేషన్ కు గడువుకు సమయం పడుతుంది కాబట్టి సబ్సిడీ సమయాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని రవి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా పెండింగ్ లో ఉన్న ప్లాట్ల క్రయ, విక్రయాలు ఊపందుకుని ప్రభుత్వానికి రెవెన్యూ పెరుగుతుందని రవి గుర్తు చేశారు.

ఇంతటి బృహొత్తర కార్యక్రమానికి సహకరించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కకు,రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు,మంత్రివర్గ ఉప సంఘానికి రవి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో కొణిజర్ల మాజీ ఎంపీపీ గోసు మధు ఆఫీస్ ఇంచార్జ్ పోగుల రవికుమార్ సీనియర్ మార్కెటింగ్ డైరెక్టర్లు షేక్ తాజుద్దీన్,కాసాని శ్రీశైలం, గాలి నారాయణ, తోట వెంకటేశ్వర్లు, బాబురావు, జానీ భాషా, వసీం, కళ్యాణ్ చౌదరి, సాయి కిరణ్, శ్రీకృష్ణ, ప్రశాంత్, శ్రీనివాసరావు, మల్లికార్జున్, పీఎన్ఆర్, ఏఎన్ఆర్, రవి కుమార్, కృష్ణ చౌదరి, రజినీకాంత్ చంద్రన్న గౌడ్, ఉపేందర్, సుమన్, అలవాల నారాయణ తదితరులు పాల్గొన్నారు.