తెలంగాణా మంత్రివర్గ విస్తరణ ఆదివారం జరిగింది. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ కొత్తగా నియమితులైన ముగ్గురు మంత్రులతో రాజ్భవన్లో పదవీ స్వీకార ప్రమాణం చేయించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలతో గవర్నర్ మంత్రులుగా ప్రమాణం చేయించారు. నూతన మంత్రులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు.
రాజ్భవన్ దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కలతో పాటు పలువురు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



