హైదరాబాద్: మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాల పునర్వవస్థీకరణపై తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో వాటిపై సమగ్ర అధ్యయనం కోసం సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ఉన్నతస్థాయి కమిషన్ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం స్వయంగా ప్రకటించారు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ రూపొందించిన 2026 డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించిన సందర్బంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, “మండలాలు, జిల్లాలు ఇటు అటుగా మార్చాలని ఇటీవల రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. తొందరల్లోనే సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో వివిధ రంగాల నిపుణులు, ఉన్నతాధికారులతో ఒక కమిషన్ను నియమిస్తాం. ఆ కమిషన్ వివిధ జిల్లాలు, ప్రాంతాల్లో పర్యటించి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తరహాలోనే అధ్యయనం చేసి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. ఆ కమిషన్ నివేదికను అసెంబ్లీ ముందు పెట్టి సమగ్రంగా చర్చించిన తర్వాత రేషనలైజేషన్కు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేస్తాం’ అని వివరించారు.

