భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్రాభివృద్ధికి రోడ్డు, రైల్వే, ఎయిర్, జల రవాణా వ్యవస్థలు అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో పలు విద్యుత్ ఉప కేంద్రాలు, కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతం, దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామాలయం అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతం చుట్టూ జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
కొత్తగూడెం నుండి కౌతాలంపూర్, కొత్తగూడెం నుండి హైదరాబాద్ వయా ఇల్లందు రహదారుల నిర్మాణం జరుగుతుందన్నారు. అలాగే పోలవరం, సమ్మక్క సారక్క, అన్నారం, సుందిళ్ల, కాళేశ్వరం రిజర్వాయర్లు పూర్తయ్యాయని, నావిగేషన్ అధ్యయనం చేపట్టి జల రవాణా కు ప్రణాళికలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కోరారు. జిల్లాలో ఎయిర్పోర్ట్ కోసం గతంలో సూచించిన స్థలం ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా కొన్ని కారణాల వలన అనుమతులు లభించలేదని, ఎయిర్పోర్ట్ నిర్మాణం కొరకు త్వరలోనే మళ్లీ అధ్యయనం చేపడతామని తెలిపారు.


