ఈనెల 15వ తేదీన తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కొందరు ‘జర్నలిస్టు’లపై చేసిన వ్యాఖ్యలు గుర్తున్నాయి కదా? రాష్ట్ర శాసనసభలో జర్నలిస్టుల పేరుతో కొందరు వ్యవహరిస్తున్న తీరుపై సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలపై పాత్రికేయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనేది వేరే విషయం. అసలు విషయం తెలుసుకునే ముందు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసారి మననం చేసుకుంటే…
“ఎవరు జర్నలిస్టులు? ఎవరు నకిలీ? జర్నలిస్ట్ సంఘాలను లిస్ట్ అడగండి అధ్యక్షా! ఆ లిస్ట్ లో లేని వాళ్ళు క్రిమినల్స్! ముసుగులేసుకుని వాళ్ళు రాసే రాతలను చూసి విశ్లేషిద్దాం! తోడ్కల్ తీసి బట్టలు వూడదీసి ఉరికించి కొడతాం! కుర్చీలో వున్నా, ఏం చేయలేడని అనుకోవద్దు! నేను ముఖ్యమంత్రిని! అధ్యక్షా మీరు అనుమతిస్తే ఒక రోజు జర్నలిస్ట్ లపై చర్చ చేద్దాం. చట్టం తీసుకొద్దాం. పరిధి దాటితే తడాఖా చూపిద్దాం. మీరు మనుషులేనా? మా ఇంట్లో ఆడబిడ్డలను తిడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? తోలు తీస్తాం”…. ఇదీ ఇవాళ తెలంగాణ శాసన సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం.. తీవ్ర ఆవేదన!
ఇంట్లో ఆడబిడ్డలను తిడుతుంటే చూస్తూ ఊర్కోవాలా? అని సీఎం నేరుగానే ప్రశ్నించారు. సోషల్ మీడియాకు చెందిన కొందరు ‘జన్రలిస్టు’ల అరాచకాలపై సీఎం సీరియస్ అయిన ఘటన నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగిన ఓ మహిళను కిడ్నాప్ చేసినట్లు వచ్చిన వార్తల్లో ప్రముఖ పత్రికకు చెందిన ఓ మండల స్థాయి విలేకరి ప్రమేయం మరుగునపడినట్లు వార్తలు రావడం గమనార్హం.
వాస్తవానికి ఈ ఘటన ఈనెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు జరిగినట్లు కొన్ని ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన వార్తల సారాంశం. మండలంలోని గౌరారం టోల్ ప్లాజీ వద్ద ఓ మహిళను కొట్టి కారులో ఎక్కించుకుని గుర్తు తెలియని వ్యక్తులు పరారయ్యారనేది ఆయా వార్తల్లో ఉటంకించిన సమాచారం. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కూాడా అయ్యాయి.

మహిళ కిడ్నాప్ నకు సంబంధించి నిన్న ప్రముఖ తెలుగు ఛానళ్లలోనూ బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. కానీ ఈకేసులో ఎటువంటి ఫిర్యాదు లేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ ఈ ఘటనలో ఏం జరిగిందనేది మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది. సీసీ కెమెరాల్లో రికార్డయిన మహిళ కిడ్నాప్ ఘటన ఎందుకు మరుగున పడిందనే అంశంపై ప్రజల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
న్యూస్ ఛానళ్లలో బ్రేకింగ్ న్యూస్ లు వచ్చిన పరిణామాల్లో ప్రభుత్వ నిఘా వర్గాలు ఈ ఘటనపై ఉన్నతాధికారులకు వివరణ పేరుతో పూర్తి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం నిఘా వర్గాలు పోలీసు ఉన్నతాధికారులకు ఇచ్చిన వివరణ సారాంశం ఇలా ఉంది.
‘పెనుబల్లి కేంద్రంగా ఓ వ్యక్తి ప్రముఖ పత్రికకు విలేకరిగా పనిచేస్తున్నాడు. అధికార పార్టీ మండల లీడర్ గానూ ప్రచారంలో ఉన్నాడు. సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన ఓ ముఖ్యనేత, జిల్లాలోని మరో కీలక నేత వర్గంలోని వ్యక్తిగా పేరుగాంచాడు. ఈ విలేకరి దశాబ్దకాలంగా పెనుబల్లిలోని ఓ కాలనీకి చెందిన మహిళ ఒకరితో సన్నిహితంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదంలో భర్తను కోల్పోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి భార్య అయిన మరో మహిళకు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె కుటుంబానికి దగ్గరైన ఈ విలేకరి రెండుసార్లు ఆమెను కొత్తగూడెం కలెక్టరేట్ కు తీసుకువెళ్లాడు. ఈ విషయం తెలిసి తన కూతురుతో సన్నిహితంగా ఉంటున్న మహిళ తల్లి ప్రముఖ పత్రిక విలేకరిని తీవ్రంగా మందలించారు. ఈ నేపథ్యంలోనే రోడ్డు ప్రమాదంలో మరణించిన టీచర్ భార్యను తీసుకుని తన కారులో విలేకరి మరోసారి కొత్తగూడెం వెడుతుండగా, అతనితో సన్నిహితంగా ఉంటున్న మహిళ, ఆమె తల్లి టోల్ ప్లాజా వద్ద కాపుకాసి, విలేకరి కారును ఆపి అతనితో గొడవకు దిగారు. ఈ సందర్భంగా విలేకరి తనతో సన్నిహితంగా ఉంటున్న మహిళను కొట్టాడు. ఆమె కూడా విలేకరికి, ప్రభుత్వ ఉద్యోగి భార్యకు దేహశుద్ధి చేసింది.’’ ఇదీ టోల్ ప్లాజా వద్ద జరిగిన మహిళ కిడ్నాప్ బాగోతంలో నిఘా వర్గాలు ఉన్నతాధికారులకు ఇచ్చిన వివరణతో కూడిన వివరాలు.

అయితే ఈ విషయంలో ఓ పోలీసు అధికారికి ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఓ మహిళా ప్రజాప్రతినిధి భర్త ఎవరు? విషయం రచ్చ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అతను కోరడంలో ఆంతర్యమేంటి? సీసీ ఫుటేజీలను ఎవరికీ ఇవ్వవద్దని టోల్ ప్లాజా సిబ్బందికి ఆ తర్వాత ఆదేశించిందెవరు? నడిబజారులో జరిగిన ఈ రచ్చపై బాధిత మహిళ ఫిర్యాదు చేయకపోవడం వెనుక గల ఒత్తిళ్లేమిటి? ఇవన్నీ ఇప్పటికిప్పుడు జవాబు లేని ప్రశ్నలు.
నిజానికి ఇటువంటి వ్యవహారాల్లో ఫిర్యాదు లేనిదే తామేమీ చేయలేమని పోలీసులు చెప్పవచ్చు. కానీ నడిబజారులో, అందునా నేషనల్ హైవేపై చోటు చేసుకున్న మహిళపై దాష్టీకం ఘటనల్లో ఖమ్మం పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న సునీల్ దత్ వంటి నిక్కచ్చి, నిజాయితీ ఐపీఎస్ అధికారి ఏమాత్రం ఉపేక్షించరనే అభిప్రాయాలు ఈ సందర్భంగా వ్యక్తమవుతున్నాయి. అనేక కీలక ఉదంతాల్లో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కనబర్చిన పనితీరుపై ప్రజలు ప్రశంసించిన ఘటనలను ఈ సందర్భంగా ఉదహరిస్తున్నారు.

వాస్తవానికి పెనుబల్లి మండల కేంద్రంగా ఈ ప్రముఖ పత్రిక విలేకరి సాగిస్తున్న అరాచకాలపై భారీ ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఇసుక దందా, నల్లబెల్లం సరఫరా ద్వారా నాటుసారా తయారీదారులకు దన్నుగా ఉండడం వంటి అనేక అంశాల్లో భారీ ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి మాఫియా దందా చాలదన్నట్లు నేషనల్ హైవేపై మహిళపై దౌర్జన్యానికి పాల్పడిన ఉదంతం రచ్చగా మారింది. అయితే అధికార పార్టీకి చెందిన కొందరు నాయకుల సపోర్ట్ వల్లే ఇతని అరాచకాలు పెరిగిపోతున్నాయని, పోలీసులు కూడా నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లు జనంలో చర్చ ఉంది.
సోషల్ మీడియాలో దూషణలకు పాల్పడే జర్నలిస్టులపైనేకాదు, నేషనల్ హైవేపై మహిళలపై పట్టపగలు దాష్టీకానికి పాల్పడే ఇటువంటి జర్నలిస్టుల బట్టలే ఊడదీస్తారో..? తోడ్కలే తీస్తారో చూడాల్సి ఉంది. వాళ్లు ప్రముఖ పత్రికలకు చెందిన విలేకరులైనప్పటికీ పాలకులు ఉపేక్షించాల్సిన అవసరం లేదేమో..!

