Top 5 This Week

Related Posts

టీఆర్ఎస్-ఎంఐఎం పార్టీలపై విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు

తెలంగాణాలో అధికార టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ‘సయామీ కవలలు’గా సినీనటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అభివర్నించారు. ఆయా పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ ఓటర్లను ధోఖా చేసే కుట్రగా పేర్కొన్నారు. ఈమేరకు ఆమె ఫేస్ బుక్ వేదికగా పలు విమర్శలు చేశారు. అందుకు సంబంధించిన పోస్టును దిగువన యధాథంగా చదవవచ్చు.

బీహార్‌లో టీఆరెస్-ఎంఐఎం కలసి బలమైన ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమిని ఓడగొడితే దేశవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు ఇక కాంగ్రెస్ గెలవదు అన్న అభిప్రాయానికి వస్తారు. తద్వారా అనేక రాష్ట్రాలలో పట్టు ఏర్పరుచుకుని, పొత్తుల ద్వారా దేశమంతా వ్యాప్తి చెందాలనే ప్రయత్నం చేశారు. అందుకు అవసరమైన పెద్ద ఎత్తు నిధులను కూడా టీఆరెస్ అందించినట్లు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి.

అయితే ఆ ఫలితాల వల్ల తెలంగాణలోని మొత్తం మైనార్టీలు టీఆరెస్ – ఎంఐఎంలకు కూడా దూరమయ్యే దిశగా చర్చిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ ప్రమాదం నుంచి బయటపడేందుకు టీఆరెస్ అధినేత ఎంఐఎంతో కలసి చర్చించి, తిరిగి మైనార్టీల నమ్మకం పొందగలిగే ఎత్తుగడలో భాగంగా దేశవ్యాప్త నేతలతో సమావేశాలు, మోడీపై యుద్ధం లాంటి నిష్ఫలమైన ప్రసంగాలు చేస్తున్నారు. గతంలో వీరి ఫెడరల్ ఫ్రంట్ విన్యాసాలు అందరూ చూసినవే.

ఇక ఈ రోజు టీఆరెస్ ప్రభుత్వాన్ని దింపుతామన్న ఎంఐఎం ఎమ్మెల్యే వ్యాఖ్యలు పూర్తిగా టీఆరెస్ – ఎంఐఎంల మ్యాచ్ ఫిక్సింగ్‌తో ఓటర్లను దోఖా చేసే కుట్ర. ఎంఐఎం ఏడుగురి ఎమ్మెల్ల్యేలతో ప్రభుత్వానికి అవసరం లేదు… పడదు. అంటే ఎంఐఎం మతకలహాలు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోస్తామని చెబుతున్నట్టా? జీహెచ్ఎంసీ ఎన్నికలయ్యాక టీఆరెస్-ఎంఐఎంలు అవసరమైతే పొత్తు పెట్టుకు తీరుతాయి. అవసరం లేకున్నా కలిసే ఉంటాయి. ఆ రెండూ పార్టీలూ వీడదీయలేని సయామీ ట్విన్స్.

విజయశాంతి

Popular Articles