వైఎస్ఆర్ సీపీ చీఫ్ వైఎస్ జగన్ కు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. తన రాజ్యసభ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో ట్వీట్ చేస్తూ వెల్లడించారు. పార్టీ చీఫ్ దేశంలో లేని సమయంలో విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన వైఎస్ఆర్ సీపీలో కలకలం రేపుతోంది. ఇటీవలే జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. మరో మూడున్నర సంవత్సరాల పదవీ కాలం ఉండగానే విజయసాయరెడ్డి తన పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. తన ఎక్స్ ఖాతాలో విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ సారాంశం దిగువన ఉన్నది ఉన్నట్లుగా…
‘‘రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడంలేదు. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వై యస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్నిచ్చి తెలుగురాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తి గతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

