హైదరాబాద్: తెలుగు న్యూస్ ఛానల్ N Tvకి చెందిన ఇద్దరు ప్రతినిధులను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఛానల్ కు చెందిన తెలంగాణా ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, కాంగ్రెస్ బీట్ రిపోర్టర్ పరిపూర్ణాచారిని, సెక్రటేరియల్ బీట్ చూసే సుధీర్ అనే రిపోర్టర్ ను గత రాత్రి హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మహిళా ఐఏఎస్ అధికారిపై వ్యక్తిత్వ హననంతో కూడిన వార్తా కథనాన్ని ప్రసారం చేశారనే అభియోగంపై నమోదైన కేసులో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి నుంచి జరిపిన విచారణలో ప్రశ్నించిన అనంతరం పరిపూర్ణాచారిని సీసీఎస్ పోలీసులు కొద్దిసేపటి క్రితం విడిచిపెట్టారు.

అయితే ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, సెక్రటేరియల్ బీట్ రిపోర్టర్ సుధీర్ ను మాత్రం వదిలేయలేదు. కొద్దిసేపటి క్రితం వీరిద్దరికీ కింగ్ కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో దొంతు రమేష్ ను, సుధీర్ ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు సన్నద్ధమైనట్లు కనిపిస్తోంది. న్యాయమూర్తి ముందు హాజరుపరిచి పోలీసులు రిమాండ్ ను అభ్యర్థించనున్నట్లు తాజా సమాచారం. కాగా గత అర్ధరాత్రి బ్యాంకాక్ పారిపోయేందుకు ప్రయత్నించడం వల్లే తాము అతన్ని ఎయిర్ పోర్టులో అరెస్ట్ చేసినట్లు దొంతు రమేష్ ను ఉద్ధేశించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన్నార్ కొద్దిసేటి క్రితమే ప్రకటించడం గమనార్హం.
Update:
కాగా ఈ కేసులో దొంతు రమేష్, సుధీర్ లపై సీసీఎస్ పోలీసులు దాఖలు చేసిన రిమాండ్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. బాధితుల ఫిర్యాదును పొందుపర్చలేదన్న నిందితుల తరపు న్యాయవాదుల వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ నిందితులిద్దరికీ షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేశారు. గత రాత్రి పొద్దుపోయే వరకు జరిగిన వాద, ప్రతివాదనల అనంతరం 1.15 ప్రాంతంలో ఈ తీర్పు వెలువడింది. రూ.20 వేల పూచీ కత్తును సమర్పించాలని, అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లరాదని నిందితులను కోర్టు ఆదేశించింది. అదేవిధంగా దొంతు రమేష్, సుధీర్ ల పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది.

