హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లాతో ప్రమాణం చేయించారు. గవర్నర్ గా శివ్ ప్రతాప్ శుక్లా పదవీ ప్రమాణ స్వీకార వాక్యాలను తెలుగులో చదవడం విశేషం.
లోక్భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాల్గొనగా, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ లతోపాటు మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.

