తెలంగాణా ప్రభుత్వం 1/70 చట్టాన్ని టచ్ చేయబోతున్నదా? ఇదే జరిగితే గిరిజనులకు, గిరిజనేతరులకు మధ్య జరిగే అనూహ్య ఘటనలను నియంత్రించే శక్తి ప్రభుత్వానికి ఉందా? షెడ్యూల్డ్ ఏరియాలో రేగే అశాంతిని చల్లార్చే అస్త్రాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయా? తెలంగాణా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చేసిన ఓ ప్రకటన ఇటువంటి అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
భూభారతి చట్టం అమలులో భాగంగా రాష్ట్రంలో ఎంపిక చేసిన నాలుగు పైలట్ మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సులో మంత్రి పొంగులేటి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. భూ బదలాయింపు చట్టం (1/70 యాక్టు)ను ఆయన నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, మంత్రి మాటల్లోని భావం మాత్రం ఈ చట్టాన్ని గుర్తు చేస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ మంత్రి పొంగులేటి ఏమన్నారంటే..

‘ఇది గిరిజన ప్రాంతం..ఈ గిరిజన ప్రాంతంలో గిరిజనులు, గిరిజనేతరులు ఉన్నారు కొన్ని మండలాల్లో. ఆ సమస్య ఉంది.. ఆ సమస్యను కూడా ఒక కమిటీని వేసి.. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వరకు ఉండే అంశాన్ని ఒక కమిటీ ద్వారా దాన్ని కూడా శాశ్వత పరిష్కారం చేయాలన్నదే మనస్ఫూర్తిగా మన ఇందిరమ్మ ప్రభుత్వముయొక్క ఆలోచనని మీ అందరికీ తెలియజేస్తూ, మరొక్కసారి మీ అందరికీ శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియపుతూ సెలవు తీసుకుంటున్నాను.. థాంక్యూ వెరీ మచ్..’ అని రెవెన్యూ మంత్రి అన్నారు.
వాస్తవానికి ఈ వ్యాఖ్యల ద్వారా 1/70 చట్టం పేరును మంత్రి పొంగులేటి ఎక్కడా ఉటంకించలేదు. కానీ రెవెన్యూ సదస్సులో, అందునా షెడ్యూల్డు ఏరియాలో గల వెంకటాపూర్ మండలంలో, గిరిజనులు, గిరిజనేతరుల మధ్య గల సమస్యగా ఆయన ప్రస్తావించడం గమనార్హం. షెడ్యూల్డు ఏరియాల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య గల ప్రధాన సమస్య భూబదలాయింపు చట్టమనేది బహిరంగమే. రాజకీయ పార్టీలు ‘తేనెతుట్టె’గా భావించే ఈ చట్టాన్ని సవరించడానికి కేంద్ర పాలకులు సైతం జంకుతూ వెనుకంజ వేస్తుంటారు. ఈ చట్టాన్ని ఎక్కడ టచ్ చేసినా దేశవ్యాప్తంగా ‘సమస్య’ను కొనితెచ్చుకున్నట్లుగానే భావిస్తుంటారు. ఇంతకీ ఏమిటీ చట్టం అంటే..
మన దేశంలోని గిరిజనుల భూముల పరిరక్షణ కోసం రూపొందించిన చట్టమే 1/70. భూ బదలాయింపు చట్టంగానూ దీన్ని వ్యవహరిస్తారు. షెడ్యూల్డు ఏరియాలోని గిరిజనుల ఆస్తుల రక్షణ కోసం 1970లో సవరించిన 1959 చట్టం ఇప్పటికీ అడవిబిడ్డలకు అస్త్రంలాంటిదేనని చెప్పవచ్చు. భూ బదలాయింపు చట్టం (1/70) అనేది షెడ్యూల్డ్ ప్రాంతాల భూమిని గిరిజనుల నుండి గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని నిషేధిస్తుంది. గిరిజనుల హక్కులను రక్షిస్తుంది. ఈ చట్టం ప్రకారం, గిరిజనులు తమ భూమిని గిరిజనేతరులకు అమ్మకూడదు, బదలాయించకూడదు. గిరిజనుల భూమిని గిరిజనేతరులు కొనుగోలు చేయకుండా, గిరిజనులు ఆర్థికంగా నష్టపోకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది. స్థూలంగా ఇదీ 1/70 చట్టపు సారాంశం.
ఈ చట్టాన్ని సవరించాలని దశాబ్ధాలుగా గిరిజన ప్రాంతాల్లో నివాసముంటున్న గిరిజనేతరులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. భద్రాచలం వంటి పట్టణంలో కనిపించే గిరిజనేతరులు నిర్మించిన బహుళ అంతస్తుల భవనాలు చట్టప్రకారం వారివి కావంటే ఆశ్చర్యం కాదు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులు స్టార్ హోటళ్లను తలపించే ఆయా లాడ్జీల్లో గిరిజనులను తీసుకువచ్చి, ఇవి మీ ఆస్తులే అంటూ.. వారిని అందులో కూర్చుండబెట్టిన ఉదంతాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రాచుర్యం పొందిన మేడారంలో దశాబ్ధాలుగా గిరిజనేతరుల ఆధీనంలో గల పంట పొలాలను ప్రస్తుతం ప్రభుత్వంతోపాటు, స్థానిక గిరిజనులు స్వాధీనం చేసుకుంటున్న ఉదంతాలు గిరిజనేతరుల్లో తీవ్ర ఆందోళనను రేపుతున్నాయి.

ఇటువంటి సందర్భాల్లో గిరిజనేతరులు మిన్నకుండడం మినహా చేసేదేమీ లేని పరిస్థితులను 1/70 చట్టం కల్పిస్తోంది. భద్రాచలం పట్టణాన్ని టౌన్ షిప్ గా మార్చి అక్కడి గిరిజనేతరుల ఆస్తులను చట్టబద్ధం చేసేందుకు చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి. మేడారం, భద్రాచలం వంటి షెడ్యూల్డు ఏరియాల్లోని ఈ ఉదంతాలు ఉదాహరణలు మాత్రమే. జార్ఖండ్ నుంచి తెలంగాణా వరకు, మహారాష్ట్ర నుంచి ఛత్తీస్ గఢ్, ఒడిషా వరకు.. రాష్ట్రం ఏదైనా దేశవ్యాప్తంగా గిరిజనుల ఆస్తులకు భూబదలాయింపు చట్టం బ్రహ్మాస్త్రం వంటిది. ఈ సమస్యను పరిష్కరించాలంటే కేంద్ర ప్రభుత్వమే చట్ట సవరణ చేస్తే తప్ప ప్రయోనం లభించదు. కానీ 1/70 చట్టాన్ని టచ్ చేసేందుకు గడచిన యాభై ఏళ్లలో ఏ పాలకులూ సాహసించిన దాఖలాలు లేవు.
ఇటువంటి పవర్ ఫుల్ చట్టంపై రాష్ట్ర పరిధిలో ఓ కమిటీని వేసి సమస్యను శాశ్వతంగా పరిష్కరించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించడం గమనార్హం. దీంతో షెడ్యూల్డు ఏరియాలో అమలులో గల భూ బదలాయింపు చట్టాన్ని తెలంగాణా ప్రభుత్వం సృశించేందుకు సంసిద్ధమవుతున్నట్లు మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ప్రతి ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న గిరిజనుల ప్రయోజనాలను ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా పరిరక్షించబోతోందన్నదే అసలు ప్రశ్న. చూడాలి ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ ఏమిటో..? దాని లక్ష్యాలేమిటో..? గిరిజనులు, గిరిజనేతరలు మధ్య సమస్యను ఏలా పరిష్కరిస్తారో..!
-ఎడమ సమ్మిరెడ్డి

