హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులపై నమోదు చేసిన కేసుల అంశంలో తెలంగాణా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన సోమవారం పోలీసు అధికారులను ఆదేశించారు. ఈమేరకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో HCU టీచర్స్ అసోసియేషన్, సివిల్ సొసైటీ గ్రూప్స్ తో కేబినెట్ సబ్ కమిటీ సభ్యులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబులతో కలిసి నిర్వహించిన చర్చల అనంతరం డిప్యూటీ సీఎం ఆయా ఆదేశాలు జారీ చేశారు.
జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న ఇద్దరు విద్యార్థులకు సంబంధించి కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలని భట్టి సూచించారు. కేసుల ఉపసంహరణ క్రమంలో ఎటువంటి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కాకుండా పోలీస్ అధికారులకు తగు సూచనలు చేయవలసిందిగా న్యాయశాఖ అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి, సైబరాబాద్ పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి, న్యాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

